మేడారం జాతరలా ఏపీకి బయలుదేరిన హైదరాబాద్ లోని సెటిలర్స్ ... చెక్ పోస్టుల వద్ద రద్దీ .. రీజన్ ఇదే !!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. లాక్ డౌన్ పై ఏం చేద్దాం అంటూ తెలంగాణ సర్కార్ ఆలోచనలో పడింది. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో లాక్ డౌన్ మళ్ళీ విధిస్తారన్న వార్తలతో సొంత ఊర్లకు పయనమయ్యారు భాగ్యనరంలోని ఏపీ సెటిలర్స్.
ఏపీకి వెళ్తున్నారా ... అన్ లాక్ 2.0 కేంద్ర మార్గదర్శకాలతో నో ఎంట్రీ ... అనుమతి తప్పనిసరి
హైదరాబాద్ లో కరోనా భయంతో ఏపీ దారి పట్టిన సెటిలర్స్
హైదరాబాద్ లో కరోనా కేసులు కంట్రోల్ చెయ్యలేనంతగా పెరుగుతున్నాయి. ఇక దీంతో మరోమారు లాక్ డౌన్ విధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ఆలోచన చేస్తోంది తెలంగాణా ప్రభుత్వం . దీని కోసం నేడు మంత్రిమండలి సమావేశం నిర్వహించనుంది. బాగా పెరుగుతున్న కేసులతో భాగ్యనగరం సతమతమవుతున్న వేళ హైదరాబాదులోని ఏపీ సెటిలర్స్ ఇప్పుడు ఏపీ దారి పట్టారు. దీంతో మేడారం జాతరలాగా జాతీయ రహదారిపై రద్దీ నెలకొంది.
కరోనా కేసులతో , మళ్ళీ లాక్ డౌన్ భయంతో.. ఏపీ బాట
హైదరాబాదు నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా వాహనాలు వెళుతున్నాయి. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ 2.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. అంతరాష్ట్ర ప్రయాణాలకు అనుమతి అవసరం లేదని మార్గదర్శకాల్లో పేర్కొంది. నిన్నటి వరకు ఏపీలోకి ప్రవేశించాలంటే అనుమతి తప్పనిసరిగా ఉండటం, కేంద్ర మార్గదర్శకాలతో వెసులుబాటు దొరికినట్టు ప్రజలు భావించి ఏపీ బాటపట్టారు. మరోపక్క హైదరాబాద్ లో మరోమారు లాక్ డౌన్ విధిస్తే అక్కడ ఉంటే ఇబ్బందికరంగా ఉంటుందని భావించి ఏపీకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలో ఎంట్రీ చెక్ పోస్టుల వద్ద రద్దీ .. భారీగా ట్రాఫిక్
దీంతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై గరికపాడు చెక్ పోస్ట్, తిరువూరు చెక్ పోస్ట్, వాడపల్లి చెక్ పోస్ట్ వద్ద భారీగా వాహనాలు చేరుకున్నాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి. ఇక ఎటువంటి రిజిస్ట్రేషన్లు, పాసులు లేకుండా వస్తున్న వారిని పోలీసులు వెనక్కి తిప్పి పంపుతున్నారు. పాస్ లు తీసుకుని అనుమతులు ఉన్నవారికే ఏపీ లోకి ఎంటర్ కానిస్తున్నారు. హైదరాబాద్ లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో భయపడి సొంత ఊర్లకు వెళ్తున్నామని, మళ్లీ లాక్ డౌన్ విధించే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వాహనదారులు చెప్తున్న పరిస్థితి ఉంది.
Recommended Video
ఏపీ బోర్డర్ ల వద్ద దారుణ పరిస్థితులు
పాస్ లు లేకుండా వెళ్తున్న వాళ్ళు కొందరు పోలీసులు బతిమిలాడుతుంటే, మరి కొందరు పోలీసులతో పెద్దఎత్తున గొడవకు దిగుతున్నారు. ఒక మేడారం జాతర ను తలపిస్తున్న ట్లుగా విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి ప్రస్తుతం ఉంది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారులు ఏపీలోకి చాలా మందిని అనుమతించకపోవడంతో మరోమారు బోర్డర్ చెక్ పోస్టుల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనే పరిస్థితి కనిపిస్తుంది .