సీఎం జగన్ వద్దకు కొత్త పంచాయితీ..తెరమీదకు సెక్స్ వర్కర్ల వ్యవహారం..ఇరకాటంలో ప్రభుత్వం..?
అమరావతి: కరోనావైరస్ కబళిస్తున్న వేళ దేశం మొత్తం లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. అయితే లాక్డౌన్ సమయంలో కొన్నిటికి మినహాయింపునిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇక లాక్డౌన్ నేపథ్యంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలను ఆదుకునేందుకు పలురకాలుగా సహాయం చేస్తున్నాయి. ఎవరూ నష్టపోకుండా లేదా ఇబ్బంది పడకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రతి ఒక్కరికీ రేషన్తో పాటు డబ్బులు కూడా ఇస్తున్నాయి. ఇక పేదలది, వలస కార్మికుల వ్యధ ఒకలా ఉంటే... సెక్స్ వర్కర్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈక్రమంలోనే తమను ఆదుకోవాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్కు లేఖ రాశారు సెక్స్ వర్కర్లు.
దయనీయంగా మారిన సెక్స్ వర్కర్ల పరిస్థితి
కరోనావైరస్ దేశంను అంధకారంలోకి నెట్టేసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశం లాక్డౌన్లోకి వెళ్లిపోవడంతో చాలామంది వ్యథలు బయటపడుతున్నాయి. చేసుకునేందుకు పనులు లేక, తినడానికి తిండి లేక కొన్ని కుటుంబాలు పస్తులే పడుకుంటున్నాయి. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు బాధలు చాలా వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి వారిలో ముందువరసలో నిలుస్తున్నారు వలసకార్మికులు. అయితే వారిని ఆదుకునేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వాలు ఇస్తున్న ఆర్థికసాయం లేదా సహాయం అందరికీ అందడం లేదనే వాదన కూడా ఉంది. ఇలాంటి వారిలో సెక్స్ వర్కర్లు కూడా ఉన్నారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు శరీరాలను అమ్ముకునే సెక్స్ వర్కర్ల పరిస్థితి ఇప్పుడు మరింత దయనీయంగా మారింది.
సీఎం జగన్కు లేఖ రాసిన సెక్స్ వర్కర్ల
లాక్డౌన్ నేపథ్యంలో సెక్స్ వర్కర్ల సంపాదన కూడా తగ్గిపోయింది. కొందరికైతే అసలు సంపాదనే లేదు. దీంతో వారి కష్టాలు రెట్టింపు అయ్యాయి. తినేందుకు తిండిలేక, నిత్యావసర వస్తువులు కొనేందుకు డబ్బులు లేక ఒక్క పూటనే కడుపు నింపుకుని మిగతా రెండు పూట్ల పస్తులు పడుకుంటున్నారు. సెక్స్ వర్కర్లలో చాలామందికి భర్త ఉండడు. వారు నమ్ముకున్న వృత్తిపైనే ఆధారపడి తమ పిల్లలను పోషించుకుంటుంటారు. వారిపై జాలి చూపే వారు కూడా ఉండరు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సెక్స్ వర్కర్లు లేఖ రాశారు. ఈ కష్టకాలంలో తమను ఆదుకోవాలంటూ లేఖలో సీఎంకు విజ్ఞప్తి చేశారు.
రేషన్ నిత్యావసర వస్తువులు అందజేయాలంటూ...
లాక్డౌన్ సందర్భంలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. రేషన్, మరియు నగదు సహాయం చేయాలని సీఎం జగన్ను కోరారు. సెక్స్ వర్కర్ల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న విముక్తి ఫోరం అనే సంస్థ సెక్స్ వర్కర్ల ఇబ్బందులను సీఎం జగన్ దృష్టికి లేఖ ద్వారా తీసుకొచ్చింది. వారికి వెంటనే రేషన్ కార్డులను జారీ చేయడంతో పాటు నిత్యావసర వస్తువులు అందజేయాలని లేఖలో కోరాయి. ఆంధ్రప్రదేశ్లో 30 సెక్స్ వర్కర్ల ప్రాంతాలు అంటే పాక్షిక రెడ్ లైట్ ఏరియాలు ఉన్నాయని వెల్లడించింది. ఇక రాష్ట్రంలో 1.20 లక్షల మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్లు విముక్తి ఫోరం ప్రతినిధులు తెలిపారు. అయితే కాలక్రమంలో సెక్స్ వర్కర్ల సంఖ్య తగ్గుతూ వస్తోందని ఆ వృత్తిని కూడా చాలామంది వీడుతున్నారని వెల్లడించారు.
Recommended Video
వెంటాడుతోన్న పేదరికం అనారోగ్యం
లాక్డౌన్ నేపథ్యంలో సెక్స్ వర్కర్ల సమస్యలు తీవ్రరూపం దాల్చాయని విముక్తి ఫోరం సభ్యులు చెప్పారు. ఓ వైపు పేదరికంతో అలమటిస్తుండగా మరోవైపు అనారోగ్యం వారిని కృంగదీస్తోందని విముక్తి ప్రతినిధులు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే లాక్డౌన్ నేపథ్యంలో మార్కెట్లో వారికి కస్టమర్లు కూడా లేకపోవడంతో వారి జీవితం మరింత దుర్భరంగా మారిందని విముక్తి ఫోరం సభ్యులు చెప్పారు. ఈ క్రమంలోనే సెక్స్ వర్కర్లకు నిత్యావసర వస్తువులు, ఆర్థిక సహాయం చేసి వారిని వారి పిల్లలను ఆదుకోవాలని సీఎం జగన్కు రాసిన లేఖలో పేర్కొన్నారు.