నవ్యాంధ్ర నాలెడ్జ్ హబ్గా మారాలి...జ్ఞానభేరితో ఆరంభం:సిఎం చంద్రబాబు
Recommended Video
అమరావతి: నవ్యాంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దాలన్న ఆకాంక్షను నెరెవేర్చే దిశలో కీలకమైన కార్యక్రమానికి సిఎం చంద్రబాబు నాంది పలికారు. నాలెడ్జ్ హబ్ లక్ష్యాన్ని సాకారం చేసేందుకు గాను ఒక బృహత్తర ప్రణాళికకు సిఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు.
దీనికి సంబంధించి విశ్వవిద్యాలయాల నుంచి తక్షణమే కార్యాచరణను ఆరంభిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమానికి 'జ్ఞానభేరి'గా నామకరణం చేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. నాలెడ్జి ప్రమోషన్ విశ్వవిద్యాలయాల నుంచే జరగాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అందుకే రాష్ట్రంలోని అన్ని వర్సిటీలలో ఒక స్ఫూర్తిదాయకమైన ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని సిఎం సూచించారు.
తిరుమల ఎస్వియూలో...తొలి జ్ఞాన భేరి
ఎపి నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దాలన్న సిఎం చంద్రబాబు ఆకాంక్షను సాకారం చేసే ప్రణాళికలో భాగంగా ప్రపంచ శ్రేణి విద్య ప్రమాణాలను నెలకొల్పడం, నిరంతర విద్యకు ప్రాధాన్యం, సాంకేతిక అనుసంధానం, నైపుణ్యాభివృద్ధి, నవ్యావిష్కరణలు, స్టార్టప్ లకు ప్రోత్సాహం వంటి లక్ష్యాలతో ఈ నెల 4న మొదటి ‘జ్ఞాన భేరి'ని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్నారు.
ఏర్పాట్లపై...సిఎం సమీక్ష
జ్ఞాన భేరి కార్యక్రమం ఏర్పాట్లపై గురువారం సచివాలయంలోని ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యా మండలి అధికారులతో సిఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ...విద్య, సాంకేతిక, పారిశ్రామిక రంగాల్లో యువతరానికి మార్గదర్శిగా నిలిచిన పలువురు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులను ఆహ్వానించి, వారి నుంచి ప్రేరణ పొందేలా కార్యక్రమాల రూపకల్పన చేయాలని సూచించారు.
విద్యార్థులతో...సిఎం సంభాషణ
జ్ఞాన భేరి కార్యక్రమంలో తాను పాల్గొని 12వేల మంది విద్యార్థులతో నేరుగా మాట్లాడతానని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు. సీఐఐ సహా వాణిజ్య, పారిశ్రామిక సంస్థలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయడం ద్వారా యువతలో శక్తిని నింపి ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేయవచ్చన్నారు.
అమలు బాధ్యత...కలెక్టర్లకు
జ్ఞాన భేరి కార్యక్రమం నిర్వహణ, అమలు, సమన్వయ బాధ్యతలను కలెక్టర్లకు అప్పగిస్తున్నామని సిఎం చంద్రబాబు ప్రకటించారు. ఉన్నత విద్యా మండలి, ఆయా వర్సిటీలే దీనికి అవసరమైన నిధులను సమకూర్చుకోవాలని ఆయన నిర్దేశించారు. రాష్ట్రంలో ప్రతి యూనివర్శిటీలో విద్యార్థుల జ్ఞాన సముపార్జనకు, భవిష్యత్ పురోగతికి ఉపయోగపడేలా ప్రతి యూనివర్శిటీలో ఇటువంటి కార్యక్రమం ఒక్కటైనా ఏర్పాటు చేయాలని సిఎం చంద్రబాబు దిశానిర్థేశం చేశారు.