తెలంగాణా బాటలో ఏపీ షట్ డౌన్ .. కరోనా పై వార్ ప్రకటించిన సీఎం జగన్
కరోనా వైరస్ దేశంలో తీవ్రంగా మారుతున్న నేపధ్యంలో దేశం షట్ డౌన్ కానుంది. ఇక కరోనా ప్రబలుతున్న దృష్ట్యా దానికి కంట్రోల్ చెయ్యటం కోసం తెలుగు రాష్ట్రాల్లోనూ సీఎంలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణా సీఎం మార్చి 31 వరకు షట్ డౌన్ ప్రకటించగా , ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం ఏపీ షట్ డౌన్ ప్రకటించారు. మార్చి 31వ తేదీ వరకూ ఆంధ్రప్రదేశ్లో లాక్డౌన్ ప్రకటించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి .
ఎమర్జెన్సీ మినహా పబ్లిక్, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ నిలిపివేత
ఏపీలోనూ కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమర్జెన్సీ మినహా పబ్లిక్, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. జనతా కర్ఫ్యూని విజయవంతం చేసినందుకు రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన సీఎం జగన్ రాష్ట్ర ప్రజల సహకారం కరోనాపై పోరాటంలో కావాలన్నారు. ఇప్పటికి ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, అందులో ఒకరికి వ్యాధి తగ్గిపోగా డిశ్చార్జ్ చేశామని పేర్కొన్నారు.
కరోనా వ్యాపించకుండానే లాక్ డౌన్
ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన 11,670 మందికి స్క్రీనింగ్ చేశామని చెప్పారు. ఇక ఏపీ లాక్ డౌన్ నిర్ణయం కరోనా కేసులు పెరగకుండా చర్యలు తీసుకునే క్రమంలోనే తీసుకున్నట్టు ప్రకటించారు . ఇక కరోనాపై పోరాటం చేస్తామని చెప్పిన సీఎం జగన్ కరోనా లక్షణాలు ఉంటే 104కు కాల్ చెయ్యాలని కోరారు . ప్రతి జిల్లా కేంద్రంలో 200 పడకల ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
రేషన్ ఫ్రీ ,ప్రతి కుటుంబానికి సాయంగా రూ. 1000
కరోనా నివారణకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారని పేర్కొన్న సీఎం జగన్ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీలో మెరుగైన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఇక వృద్ధులను, పెద్ద వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. కరోనాను ఎదుర్కోడానికి అందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇక ఏపీలో ప్రజలకు ఎలాంటి కష్టం కలుగకుండా చూసుకుంటామని చెప్పారు . రేషన్ ఫ్రీ గా ఇస్తామని , ప్రతి కుటుంబానికి సాయంగా రూ. 1000 అందిస్తామని సీఎం జగన్ ప్రకటించారు.
నిత్యావసరాలు బ్లాక్ చేస్తే జైలుకు
ప్రజలెవరూ గుంపులుగా తిరగొద్దని , ఫ్యాక్టరీలు, ప్రైవేట్ ఆఫీసులు కూడా మూసివేయాలని సూచించారు. నిత్యావసర దుకాణాలు తప్ప మిగతావన్నీ బంద్ చేస్తామని చెప్పారు. ఇక ఎవరైనా నిత్యావసరాలు బ్లాక్ చేస్తే జైలుకు వెళ్తారని హెచ్చరించారు .ప్రభుత్వం ప్రకటించిన ధరలను మించి అమ్మితే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 10వ తరగతి పరీక్షలు యదాతథంగా జరుగుతాయన్న సీఎం, సమస్యలు ఉన్న విద్యార్థలకు ప్రత్యేక రూమ్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.