కాన్వాయ్లో ప్రమాదం: స్పీకర్ కోడెలకు తప్పిన ముప్పు, ఇద్దరికి గాయాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కాన్వాయ్లో గురువారం ప్రమాదం చోటు చేసుకుంది. స్పీకర్ ప్రయాణిస్తున్న కాన్యాయ్ సత్తెనపల్లి నుంచి రాజుపాలెం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కాన్వాయ్లోని ఓ వాహనం ఎదురుగా వస్తున్న ఓ బైక్ను ఢీకొట్టడంతో ఇద్దరికి గాయాలయ్యాయి.
దీంతో గాయపడిన వారిని హుటాహుటిన సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు చికిత్సను అందిస్తోన్న వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అంతక ముందు స్పీకర్ కోడెల శివప్రసాదరావు సత్తెనపల్లిలో ఒకే రోజు 2 లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో కలసి శ్రీకారం చుట్టారు. పట్టణంలోని సుగాలీకాలనీ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో సామూహిక వనమహోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక మహోద్యమంలా చేపట్టాలని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు రాష్ట్రం మొత్తం మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని అన్నారు. హరిత సత్తెనపల్లి సాకారానికి ఒకేరోజు 2 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు.
మొక్కలను కన్న బిడ్డల్లా చూసుకుంటే అవి పండ్లు, ఫలాలు మంచి వాతావరణాన్ని అందిస్తాయని తెలిపారు. అనంతరం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ త్వరలో తన నియోజకవర్గమైన చిలకలూరిపేటలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు ఆయన చెప్పారు.
ఏపీలో అభివృద్ధిలో మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే సత్తెనపల్లి ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. రాష్ట్రంలో 5కోట్ల జనాభా ఉంటే ఒక్కొక్కరూ 10 మొక్కల చొప్పున 50 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, విద్యార్ధలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.