రాజధానిపై ఏపీ స్పీకర్ తమ్మినేని స్పందన .. కానీ ఇంత రచ్చ జరుగుతున్నా సీఎం జగన్ స్పందించరేం ?
Recommended Video
రాజధాని అమరావతి పై కొనసాగుతున్న రణం ఆగటం లేదు .ఇక ఇప్పటికీ రాజధాని అమరావతి విషయంలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. దీంతో ప్రజలు మరింత గందరగోళానికి గురవుతున్నారు.రాజధాని అంశం పెను తుఫానుగా మారుతున్నా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించకపోవడం తో ఈ అనుమానం మరింత ముదురుతుంది. ఇక ఈ నేపథ్యంలో రాజధాని మార్చే ఆలోచన జగన్ కు లేదు అంటూ కొందరు నేతలు, త్వరలో రాజధానిపై ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటిస్తామని మరికొందరు వైసీపీ నేతలు, రాజధాని వికేంద్రీకరణ అవసరం అని ఇంకొందరు నేతలు చెప్పడం ఏపీలో గందరగోళానికి గురి చేస్తుంది.
రాజధానిని దొనకొండకు మార్చే అంశంపై స్పందించిన ఏపీ స్పీకర్ తమ్మినేని
ఇక తాజాగా రాజధాని అమరావతిని మారుస్తారంటూ రాజకీయాలు వేడెక్కిన నేపథ్యంలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధానిని అమరావతి నుండి దొనకొండ కు మారుస్తున్న ట్లుగా వస్తున్న వార్తలపై స్పందించిన ఆయన రాజధానిపై ఇంత చర్చ జరగడం అర్థరహితమని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. . రాజధాని మారుస్తామని చెప్పిందెవరు? సీఎం చెప్పారా? అంటూ అసహనం వ్యక్తం చేసిన ఆయన, మంత్రి బొత్సా సత్యన్నారాయణ రాజధాని విషయంలో శివరామకృష్ణన్ కమిటీ నివేదిక గురించి మాట్లాడినంత మాత్రాన ఇంత రాద్ధాంతం చేయాలా అంటూ మండిపడ్డారు. ఇక కాలమే అన్నీ నిర్ణయిస్తుంది అని ఆయన తేల్చి చెప్పారు.
రాజధాని రణం ఉధృతమవుతున్నా సైలెంట్ గా ఉన్న ఏపీ సీఎం జగన్
గత కొన్నిరోజుల నుంచి రాజధాని అమరావతి విషయంలో అధికార, విపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాష్ట్రంలో యుద్ధ వాతావరణం నెలకొంది . దీనికితోడు రాజధాని రైతులు రాజధానిని మారిస్తే ఆత్మహత్యలు చేసుకుంటామని, తమ ప్రయోజనాలను దెబ్బతీయవద్దంటూ ఇప్పటికే ఆందోళనల బాట పట్టారు. రాజధాని మార్పు అంశంపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. రాజధాని రణం ఉధృతమై తీవ్ర రూపు దాలుస్తోంది. కానీ ఏపీ సీఎం జగన్ ఈ రాద్దాంతం ఆగేలా ఎలాంటి ప్రకటన చెయ్యటం లేదు. జగన్ కూడా ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలని భావించి సైలెంట్ గా ఉంటున్నారన్న చర్చ ఏపీలో జోరుగా సాగుతుంది.
రాజధానిపై జగన్ మాట కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రజలు
కొందరు విపక్ష నేతలు ఇప్పటికే నాలుగు రాజధానులని ప్రకటన చేయగా , ప్రకాశం జిల్లాలో రాజధాని అని మరికొందరు సచలన వ్యాఖ్యలు చేశారు. ఇక వేలకోట్లు వ్యయంతో నిర్మించిన రాజధాని ప్రాంతంలో ప్రజలకు ఒక డైలమా నెలకొంది. ఇప్పటికే రాజధాని ఏర్పాటులో భాగంగా నిర్మించిన భవనాలు ఉండగా రాజధాని మార్చాలన్న ఆలోచన తప్పు అని అటు విపక్షాలు, ఇటు రాజధాని రైతులు వాపోతున్నారు. ఇంతా జరుగుతున్నా ఒక్క మాట కూడా జగన్ మాట్లాడని తీరు సర్వత్రా చర్చకు కారణం అవుతుంది. ఎవరి ఎన్ని చెప్పినా, ఇప్పుడు ఉన్న సందిగ్ధ పరిస్థితిలో జగన్ మాట కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.