సీఎం జగన్ కు కేంద్రమే రక్షణగా : ప్రశ్నంచలేని స్థితిలో చంద్రబాబు..పవన్: ఆ ఇష్యూలో పరోక్షంగా...!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ప్రధాని మోదీనే రక్షగా ఉన్నారా. కీలకమైన ఆ అంశంలో పరోక్షంగా అండగా నిలబ్డడారా. నాడు జగన్ చేసింది ఇప్పుడు చంద్రబాబు చేయలేకపోతున్నారు. పవన్ సైతం ఇరకాటంలో పడ్డారు. ముఖ్యమంత్రి జగన్ 2019 ఎన్నికల ముందు నుండి బీజేపీ పెద్దలకు దగ్గరయ్యారు. జగన్ ట్రాప్ లో పడి చంద్రబాబు ప్రత్యేక హోదా అంశం పైన కేంద్రం తో విభేదించి వారితో పొత్తు తెంచుకున్నారు. జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ తో జత కట్టి మోదీ ఇక ప్రధాని కారని ప్రచారం చేసారు. కానీ, సీన్ రివర్స్ అయింది. ఏపీలో అధికారం పోగొట్టుకున్నారు.
కేంద్రంలో తిరిగి మోదీ ప్రధాని అయ్యారు. రెండేళ్లుగా చంద్రబాబు ప్రధానికి.. కేంద్రానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ, సాధ్యపడటం లేదు. అదే సమయంలో తాను నమ్ముకున్న రాహుల్ గాంధీ అండ్ కో రాజకీయంగా బాగా వీక్ అయిపోయారు. ఇక, బీజేపీ ముందుగానే పవన్ ను తమతో కలుపుకుంది.
బీజేపీ కోసం పవన్..చంద్రబాబు
ఏపీలో జనసేనతో మాత్రమే తమకు పొత్తు కొనసాగుతుందని తేల్చి చెప్పింది. ఫలితంగా పవన్ సైతం చంద్రబాబుకు ఇప్పటికిప్పుడు సహకరించే పరిస్థితి లేదు. అయితే, జగన్ తో ఎక్కువ కాలం కేంద్ర పెద్దలతో సఖ్యత ఉండదని ప్రతిపక్షాలు అంచనా వేసాయి. ఏపీ బీజేపీ నేతల నుండి విమర్శలు వచ్చినా..మత రాజకీయం చేసే ప్రయత్నం చేసినా..జగన్ కేంద్రంతో సఖ్యత కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే, తాను చెప్పిన అన్నీ చేశానని చెబుతున్న జగన్ ప్రత్యేక హోదా విషయంలో మాత్రం ఇప్పటి వరకు మడమ తిప్పినట్లే ననే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ప్రత్యేక హోదాపై జగన్ సేఫ్ గేమ్..
జగన్ ఎన్నికల్లో గెలిచిన తరువాత తొలి సారి ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని కళ్లలో ఆనందం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. జగన్ గెలిచాడనే ఆనందం కంటే..చంద్రబాబును ఘోరంగా ఓడించారనే సంతోషంతో జగన్ కు ఆలింగనం చేసుకొని మరీ అభినందించారు. ఇక, 2019 ఎన్నికల్లో తమ పార్టీకి 25 ఎంపీలు గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ పెద్ద ఎత్తున ప్రచారం చేసారు. ఫలితంగా ఎన్నికల్లో 22 ఎంపీ స్థానాలు గెలుచుకున్నారు. కానీ, ఢిల్లీ వెళ్లిన ప్రతీ సారి కేంద్రంలో పూర్తి మెజార్టీ ఉన్న ప్రభుత్వం ఉంది..మన అవసరం ఉంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా తెచ్చేవాళ్లమని ప్రజలను కన్వీన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, ఈ వాదన కేంద్రానికి మరింత ఉపశమనం కలిగిస్తోంది. హోదా ఊసే లేదు.
జగన్ ట్రాప్ లో చంద్రబాబు..
ఇదే హోదా అంశంలో చంద్రబాబును తన ట్రాప్ లోకి దింపి..అందరికీ దూరం చేసిన విషయాన్ని ఇప్పుడు చంద్రబాబు తిరిగి చేయలేకపోతున్నారు. హోదా గురించి ప్రస్తావిస్తే..కేంద్రాన్ని ప్రశ్నించాలి. జగన్ ను తప్పు బడితే కేంద్రం పైకి నెపం తోసేస్తున్నారు. చంద్రబాబు ఇప్పుడు ఉన్న పరిస్తితుల్లో కేంద్రాన్ని ప్రశ్నంచలేరు. హోదా గురించి మాట్లాడితే వైసీపీ నుండి ఎదురు దాడి మొదలవుతుంది. హోదా తాకట్టు పెట్టి ప్యాకేజి కోసం ఒప్పందం చేసుకున్నారంటూ వైసీపీ నేతలు చరిత్ర మళ్లీ వినిపిస్తారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ సైతం అడగలేరు. ఆయన ఇప్పుడు బీజేపీతో జత కట్టి ఉన్నారు. గతంలో ప్రత్యేక హోదా కోసం ఎవరినైనా నిలదీస్తానని చెప్పిన పవన్...ఇప్పుడు జగన్ ప్రభుత్వాన్ని కనీసం ప్రశ్నించటం కూడా మానేసారు.
ప్రధాని మోదీనే హోదాలో జగన్ కు రక్ష..
ఆయన సైతం ప్రశ్నించే అవకాశాలు లేవు. కేంద్రంతో సత్సంబంధాలు కోరుకుంటున్న మిత్రుడు పవన్... మిత్రుడుగా మారాలనుకుంటున్న చంద్రబాబు ఇద్దరూ ఈ అంశాన్ని పూర్తిగా వదిలేసారు. వారికి మోదీతో సంబంధాలు అవసరమని భావిస్తున్నారు. దీంతో..హోదా అంశంలో తాము ఇవ్వకపోయినా.. జగన్ ప్రభుత్వం రాజకీయంగా ఈ అంశంలో ఇబ్బంది పడకుండా పరోక్షంగా రక్షణ ఇస్తోంది ప్రధాని మోదీనే. ఇక, ఇప్పటికే అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావటం..ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు బీజేపీ పెద్దలకు దగ్గరయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలు తెలిసిన వైసీపీ..హోదా అంశం విషయంలో తిరిగి చంద్రబాబును ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. మోదీ అంటే చంద్రబాబుకు భయమని..ఆయన ఎందుకు ప్రశ్నించరని నిలదీస్తోంది. వైసీపీ ట్రాప్ లో చంద్రబాబు చిక్కుతారా లేదా అనేది పక్కన పెడితే..హోదా అంశంలో సీఎం జగన్ కు దోషిగా నిలబడాల్సిన అవసరం లేకుండా పోయింది.