చంద్రబాబు ఒక్కరోజు ఢిల్లీ దీక్షకు భారీ ఖర్చు: ఏపీ నుంచి 2 రైళ్లకే రూ.1.12 కోట్లు
అమరావతి: విభజన ద్వారా ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని, ఆస్తి పంపకాల్లో అన్యాయం జరిగిందని, లోటు బడ్జెట్ ఉందని, రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని నిత్యం చెబుతున్న తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన ధర్మపోరాట దీక్షలు, హోటల్ ఖర్చులు, విదేశీ ప్రయాణాల కోసం కోట్లాది రూపాయలు ఎడాపెడా ఖర్చు చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాదు మంత్రి యనమల కంటి చికిత్స సంచలనంగా మారింది.
ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తోందని దీక్ష
తాజాగా, టీడీపీ ఇష్టారీతిన ఖర్చు చేస్తోందని చెప్పడానికి మరో నిదర్శనం.. ఫిబ్రవరి 11వ తేదీన (సోమవారం) చంద్రబాబు ఢిల్లీలో తెలియజేయనున్న నిరసన కార్యక్రమం అని అంటున్నారు. ఇందుకోసం భారీగా ఖర్చు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. నాలుగేళ్ల పాటు మోడీ ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు ఎన్నికలకు ముందు కేంద్రాన్ని నిలదీయడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తోందని ఆరోపిస్తూ సోమవారం చంద్రబాబు ఢిల్లీలో నిరసన చేపట్టనున్నారు.
రెండు రైళ్లు బుక్ చేసుకున్నారు
ఈ నిరసన కార్యక్రమం కోసం జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంట్ రూ.1.12 కోట్లు విడుదల చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. సౌత్ సెంట్రల్ రైల్వేకు చెందిన రెండు రైళ్లను బుక్ చేసుకునేందుకు వీటిని విడుదల చేసారని తెలుస్తోంది. ఒక్కో రైలులో ఇరవై కోచ్లు ఉండేలా రెండు రైళ్లు బుక్ చేశారని తెలుస్తోంది. అంటే ఢిల్లీలో చంద్రబాబు నిరసన దీక్షకు కేవలం రైళ్ల కోసం ఈ మొత్తం ఖర్చు పెడుతుండటం గమనార్హం.
అనంతపురం, శ్రీకాకుళం నుంచి
ఈ రైళ్లు అనంతపురం నుంచి ఒకటి, శ్రీకాకుళం నుంచి ఒకటి బయలుదేరుతుంది. చంద్రబాబు చేసే ఒక్కరోజు నిరసన దీక్ష కోసం ఈ రైళ్లు వెళ్తున్నాయి. ఈ రెండు రైళ్లు కూడా ఫిబ్రవరి 10వ తేదీన ఉదయం (ఆదివారం) ఢిల్లీకి చేరుకోనున్నాయి. ప్రభుత్వం సొమ్ముతో దీక్షలు చేస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. మొత్తంగా చంద్రబాబు ఢిల్లీ దీక్షకు దాదాపు రూ.పది కోట్ల ఖర్చు అవుతుందని పలువురు అంచనాలు వేస్తున్నారు.
భారీ ఖర్చులు అంటూ విమర్శలు
చంద్రబాబు దీక్షలు, ఇతర కార్యక్రమాల పేరుతో భారీగా ఖర్చు పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. నవ నిర్మాణ దీక్షకు రూ.13 కోట్లకు పైగా, ధర్మ పోరాట దీక్ష హోర్డింగ్స్ కోసం దాదాపు రూ.4 కోట్లు.. ఇలా భారీ ఖర్చు చేస్తున్నారనే విమర్శలు బీజేపీ, వైసీపీల నుంచి వస్తున్నాయి.