అమరావతికి వెళ్దాల్సిందే: స్థానికతపై ఉద్యోగ సంఘాల నేతల సందేహం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ిరానికి శాఖల తరలింపు ఖాయమని, రాష్ట్ర రాజధాని అమరావతికి ఒకేసారి వెళదామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన రాష్ట్ర ఉద్యోగులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని నుంచే సాధ్యమైనంత త్వరంగా పాలన ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ఉద్యోగ జేఏసీ, సచివాలయ ఉద్యోగ సంఘం నాయకులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, కమిటీ చైర్మన్ జవహర్ రెడ్డి బుధవారం సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి సాధ్యమైనంత త్వరగా శాఖల తరలింపునకు, పరిపాలన కొనసాగింపునకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని ఉద్యోగ నేతలు కృష్ణారావుకు హామీ ఇచ్చారు. తమ పిల్లల భవిష్యత్తు మినహా తమకు ఎటువంటి సందేహాలు లేవని చెప్పారు. ఇన్నాళ్లూ హైదరాబాద్లో చదువుతున్న తమ పిల్లల స్థానికతపై సమస్యలొస్తాయేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు.
అమరావతిలో ఉంటూ విధులు నిర్వర్తించేందుకు హెచ్ఆర్ఎ 30 శాతం పెంచాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే సాధ్యమైనంత త్వరగా అమరావతి వెళ్లేందుకు సిద్ధమేనని వారు చెప్పారు
పిల్లల స్థానికతకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు చెప్పారు. తొమ్మిదో తరగతి లోపు చదువుతున్న విద్యార్థులు 9శాతానికి మించరని అభిప్రాయపడ్డారు. స్థానికతకు ఎలాంటి సమస్యలు రావని, అవసరమైతే ఒక సర్క్యులర్తో పరిష్కరించుకోవచ్చని ఆయన హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా సచివాలయంతో సహా అన్నీ శాఖాధిపతుల కార్యాలయాలను ఒకేసారి తరలిస్తామని చెప్పారు.
ఉద్యోగులు కోరినట్లు కొన్ని శాఖలు ఒకసారి, కొన్ని శాఖలు మరోసారి కాకుండా అన్నీ కార్యాలయాలను ఒకేసారి తరలిస్తామని తేల్చి చెప్పారు. దానికి వీలైనంత త్వరగా వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. అవసరమైతే ఉద్యోగులకు కావాల్సిన ఇళ్ల నిర్మాణాలను వెంటనే చేపడతామని తెలిపారు. 30 శాతం హెచ్ఆర్ఏపైనా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. సీఎం టర్కీ పర్యటన నుంచి తిరిగొచ్చేదాకా దీనిపై నిర్ణయం తీసుకుంటామని సీఎస్ ఐవైఆర్ చెప్పినట్లు ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు.
అయితే, మరో రెండేళ్లలో సర్వీసు ముగిసే ఉద్యోగులు అమరావతి తరలేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లోనే రిటైర్ అవ్వాలని భావిస్తున్నారు. అయితే కొత్తగా ఉద్యోగంలో చేరినవారు మాత్రం వెంటనే అమరావతికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.