అప్పులాంధ్రప్రదేశ్- పరిమితికి మించి చేబదుళ్లు- భయపెడుతున్న ఆర్బీఐ రిపోర్ట్
గత ప్రభుత్వాల అప్పుల భారాన్ని మోసుకుంటూ అధికారం చేపట్టిన వైసీపీ సర్కారు తాను కూడా వారికి ఏమాత్రం తీసిపోనని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటోంది. ముఖ్యంగా భారీ సంఖ్యలో అమలు చేస్తున్నసంక్షేమ పథకాలకు, రాష్ట్రానికి వస్తున్న ఆదాయానికి ఎటువంటి పొంతనా లేకపోవడంతో అప్పుల భారం రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే దాదాపు మూడు లక్షలకు పైగా అప్పు కలిగిన రాష్ట్ర ప్రభుత్వం... తాజాగా చేబదుళ్ల రూపంలోనూ పరిమితికి మించి అప్పులు చేస్తోందని ఆర్బీఐ నెలవారీ నివేదిక వెల్లడించింది.
అప్పులతో మూలుగుతూ చేబదుళ్లకు..
ఏపీలో వైసీపీ సర్కారు అధికారం చేపట్టే నాటికి 2.59 లక్షల కోట్ల అప్పులు వారసత్వంగా సంక్రమించాయి. వీటిని తీర్చేందుకు నెలకు 700 కోట్ల రూపాయలకు పైగా వడ్డీలు కడుతున్నారు. ఈ భారం ఇప్పట్లో వదిలించుకునే పరిస్ధితి లేకపోగా.. కొత్త అప్పులు చేయకపోతే సరిపోతుందనే వారూ ఉన్నారు. కానీ ప్రభుత్వం వందల సంఖ్యలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో అప్పుల భారం తడిసి మోపెడవుతోంది. ముఖ్యంగా ఆర్బీఐ ఇచ్చిన రుణాల పరిమితిని పూర్తిగా వినియోగించేసుకుని, ఇప్పుడు బహిరంగ మార్కెట్లో దొరికే చేబదుళ్లకూ ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. అయితే పరిమితి కూడా ఏపీ దాటేసిందని ఆర్బీఐ తాజా నివేదిక వెల్లడించింది.
చేబదుళ్లలో మూడో స్ధానం...
ప్రభుత్వాలు బహిరంగ మార్కెట్ నుంచి తప్పినిసరి పరిస్ధితుల్లో చేబదులు కింద కొంత మొత్తాన్ని తెచ్చుకోవడం, ఆదాయం రాగానే తిరిగి చెల్లించేయడం సర్వసాధారణమే. కానీ ఇక్కడ చేబదులు కోసం చేబదులు కాకుండా ఆర్బీఐ విధించిన పరిమితిని మించి ఏపీ సర్కార్ చేబదుళ్ల కోసం వెంపర్లాడుతుండటమే విశేషం. తాజాగా అక్టోబర్ నెలలో 31 రోజులూ ఏపీ ప్రభుత్వం స్పెషల్ డ్రాయింగ్ చేబదుళ్లు, 17 రోజుల ఓవర్ డ్రాఫ్ట్కు కూడా వెళ్లింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ చేబదుళ్ల రూపంలో ఏపీ సర్కారు తీసుకుంది అక్షరాలా రూ.37250 కోట్లు. ఇది దేశంలోనే మూడో అత్యధిక మొత్తం. మొదటి రెండు స్ధానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు ఉన్నాయి.
Recommended Video
ఏపీ నెలవారీ సగటు అప్పు రూ.5300 కోట్లు
ఏపీ ప్రభుత్వం సాధారణ అప్పుల జాబితాలోనూ పరిమితికి మించి పోతోంది. గతేడాది తీసుకున్న అప్పులో 87 శాతం అప్పును ఈ ఏడాది తొలి ఏడు నెలల్లోనే ఏపీ తీసేసుకుంది. ఈ లెక్కన ప్రతీ నెల సగటున రూ.5321 కోట్ల అప్పు చేసింది. ఇదే పరిస్ధితి కొనసాగితే ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసేనాటికి ఏపీ అప్పు రూ.63,857 కోట్ల అప్పు చేసినట్లవుతుంది. 2018-19తో పోలిస్తే 2019-20 నాటికి 40 శాతం అప్పు పెరగగా... 2020-21 సంవత్సరానికి ఇది 50 నుంచి 55 శాతానికి పెరుగుతోందని ఆర్బీఐ తన నెలవారీ నివేదికలో అంచనా వేసింది. ఇదే పరిస్ధితి ఐదేళ్లు కొనసాగితే జగన్ సర్కారు కూడా మరో 3 లక్షల కోట్ల అప్పులు చేయడం ఖాయమే. అప్పులు చంద్రబాబు సర్కార్ చేసిన దాదాపు 3 లక్షల కోట్ల అప్పులకు ఇవి తోడయితే జగన్ సర్కారు ఐదేళ్లు పూర్తి చేసుకునే సరికి రాష్ట్రం 6 లక్షల కోట్ల అప్పులకు చేరుకోవడం ఖాయం.