స్థానిక ఎన్నికలకు సిద్దం : మూడో దశలో మున్సిపల్ ఎన్నికలు : ఎన్నికల సంఘం సమాయత్తం..!
ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కార్యాచరణ సిద్దం అవుతోంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైన రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక విభాగాలతో సమీవేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడగానే రిజర్వేషన్ అంశం పైన స్పష్టత వస్తుందని ఆ వెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని నిర్ణయించారు.
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు..
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైన రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఇందు కోసం కీలక విభాగాలతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేంలో మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న వనరులు..తీసుకోవాల్సిన నిర్ణయాల పైన ఇందులో చర్చించారు. ప్రధానంగా రెండు లేదా మూడు నెలల కాలంలోనే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలనే ఆలోచనలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాచరణ సిద్దం చేయాలని నిర్ణయించింది. దీని కోసం అవసరమైన చర్యలు..సాంకేతిక అంశాలు..క్షేత్ర స్థాయి సమస్యల పైనా చర్చ జరిగింది. ఇక, ప్రధానంగా రిజర్వేషన్ అమలు పైనే ఎక్కువగా చర్చించిన అధికారులు..కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాతనే దీని పైన స్పష్టత వస్తుందని అంచనాకు వచ్చారు.
మూడు దశల్లో పోలింగ్...
స్థానిక సంస్థల ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఏపీలోని మొత్తం 13,060 గ్రామ పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండో దశలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని సూత్ర ప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఇక, మూడో దశలో మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణ పైనా నిర్ణయం జరిగింది. అయితే బ్యాలెట్ విధానంలో గ్రామ పంచాయితీ ఎన్నికలు..ఈవీఎంలతో ఎంపీటీసీ, జడ్పీటీసీ , మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇదే సమయంలో రిజర్వేషన్ల అంశం పైన సుదీర్ఘంగా చర్చించారు. సుప్రీంకోర్టు 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయరాదని ఆదేశించింది. దీంతో, రిజర్వేషన్ల అంశం పై కొత్త ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక, మున్సిపాల్టీల్లో విలీనానికి సంబందించిన వివాదాల పైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ బాధ్యత మున్సిపల్ శాఖ చూస్తుందని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
త్వరలో ఓటర్ల జాబితా..
ఈనెల 10వ తేదీన పంచాయితీలు..పట్టణ స్థానిక సంస్థల్లోనూ ఓటర్ల జాబితాల విడుదలకు చేయాలని నిర్ణయించారు. ఏపిలోని మొత్తం 12,918 పంచాయతీల్లో ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాలను ఈనెల 10న ప్రకటించేలా అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణ ఎన్నికల్లో ఉపయోగించిన జాబితాల ఆధారంగా గ్రామ పంచాయతీల వారీగా పురుషులు, మహిళలు, ఇతర ఓటర్ల జాబితాల సీడీలను అధికారులు సిద్ధం చేశారు. పంచాయతీల్లో వివిధ వర్గాల జనాభా ఆధారంగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశాక స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది. అదే విధంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ పైనా నిర్ణయం తీసుకోనున్నారు. వచ్చే రెండు నెలల కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.