ఆరు నెలల్లో అప్పులు రూ.29 వేల కోట్లు: సీఎం బర్త్ డే పధకం..అమ్మ ఒడి అమలయ్యేనా : జగన్ సైతం ఇలా.!
సంక్షేమ పధకాలను కాసుల కొరత వెంటాడుతోంది. ముఖ్యమంత్రి జగన్ సామర్ధ్యానికి పరీక్షగా మారింది. ఇప్పటికే ఆరు నెలల కాలంలోనే జగన్ ప్రభుత్వం రూ 29 వేల కోట్ల అప్పులు చేసింది. నిబంధనల ప్రకారం మరో 3,300 కోట్లకే చాన్స్ ఉంది. జగన్ ప్రభుత్వం... మళ్లీ అప్పుల వైపే చూస్తోంది. ఈ దిశగా అనుమతించాలంటూ కేంద్రానికి లేఖ రాసింది. ఇప్పటికే రుణ పరిమితిని చేరుకున్న రాష్ట్రం.. వచ్చే మూడు నెలల కాలానికి అదనపు రుణ సమీకరణకు ఒప్పుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. అయితే, ముఖ్యమంత్రి జగన్ మాత్రం ధీమాగా కనిపిస్తున్నారు. మరిన్ని పధకాల అమలు దిశగా ఇప్పటికే అమలు తేదీలు సైతం ప్రకటించారు. ఖాళీ ఖజానాతోనే ముఖ్యమంత్రి సంక్షేమ పధకాల అమలుకు తీసుకుంటున్న చర్యలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.
ఇప్పటికే రూ.29 వేల కోట్ల అప్పు
సంక్షేమ పధకాల అమలు జోరులో ఇంకా డిసెంబరు పూర్తి కాకముందే రాష్ట్రం ఈ మొత్తం పరిమితిని వాడేసింది. రూ.29వేల కోట్ల అప్పు ఇప్పటికే తెచ్చుకుంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం ఈ ఏడాదికి రూ.32,300 కోట్ల వరకూ రాష్ట్రం అప్పు తీసుకోవచ్చు. ఇందులో ఇప్పటికే రూ.29వేల కోట్ల అప్పు తెచ్చారు కాబట్టి ఇంకా రూ.3,300 కోట్ల అప్పు తెచ్చుకునే వెసులుబాటు మాత్రమే ఉంటుంది. కానీ, నిబంధనలకు విరుద్ధంగా రూ.15వేల కోట్ల అప్పు కోసం అనుమతివ్వాలని రాష్ట్ర ఆర్థిక శాఖ కోరింది. ఇప్పుడు కేంద్రం ఈ మేరకు సానుకూలంగా స్పందిస్తేనే..రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటు కలగనుంది. కొత్తగా ఆర్టీసీ ఉద్యోగుల ను ప్రభుత్వ రవాణా రంగంలో చేర్చటం ద్వారా వారి జీతాల భారం వచ్చే నెల నుండి ప్రభుత్వం మీదనే పడనుంది.
ఆ రెండు పధకాల పైన ప్రభావం..
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే పలు కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ నెల 21న సీఎం జగన్ జన్మదినం. అదే రోజు చేనేతలకు వైఎస్ఆర్ నేతన్న నేస్తం పేరుతో ప్రతి ఏటా రూ.24వేలు చొప్పున ఇచ్చేందుకు కేబినెట్ ఓకే చేసింది. ఈ పథకం అమలుకు రూ.216 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్న ప్రభుత్వం.. ఏటా డిసెంబర్ 21న చేనేత కుటుంబాలకు ఈ ఆర్థిక సాయాన్ని బ్యాంకు ద్వారా అందజేయాలని నిర్ణయించింది. అది కూడా ఒకే విడతలో రూ.24వేలు సాయం చేయాలని.. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 90వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అదే విధంగా తొలుత జనవరి 26న ప్రారంభించాలని భావించిన అమ్మఒడి జనవరి 9నే ప్రారంభించాలని నిర్ణయించారు. ఒక్కో తల్లికి రూ 15 వేలు చొప్పున అందించాల్సి ఉంది. ఇప్పుడు ఈ పధకాలకు నిధలు వేటను ప్రభుత్వం ప్రారంభించింది.
ముఖ్యమంత్రి మాత్రం ధీమాగా...
ముఖ్యమంత్రి జగన్ తొలి ఆరు నెలల్లోనే సంక్షేమ పధకాలు అమలు చేయటం ప్రజల్లో చెప్పుకోవటానికి రాజకీయంగా మేలు చేసినా..ఆర్దికంగా ఎలా నెట్టుకొస్తారనేది మంత్రులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు తాము రెండు సార్లు మాత్రమే ఓడీకి వెళ్లామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నా..కొత్తగా రెవిన్యూ పెంచుకొనే అవకాశాలు మాత్రం కనిపించటం లేదు. ఇక, ఇదే సమయంలో ప్రతీ నెలా జీతాలు..పెన్షన్లు...నిర్వహణా ఖర్చులు భారీగా ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో సీఎం సైతం నిధుల సర్దుబాటు పైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం పైన ఆశలు పెట్టుకున్నా..ఆశించిన స్థాయిలో మాత్రం సాయం అందటం లేదు. అయినా..తానిచ్చిన మాట నుండి వెనకడుగు వేసేదీ లేదని మాత్రం సీఎం స్పష్టం చేస్తున్నారు. దీంతో..ఇప్పుడు కొత్త పధకాలు..ఆర్దిక సంవత్సరం ముగింపు ప్రభుత్వంలోని మంత్రులు..అధికారులకు ఆందోళన కలిగిస్తోంది.