ఏపీలో తగ్గిన అవినీతి..దేశంలో 13వ స్థానంలో: 5వ స్థానంలో తెలంగాణ: తాజా సర్వేలో ఆసక్తి కరంగా..!
అవినీతి ఏ స్థాయిలో ఉందనే అంశం మీద జాతీయ స్థాయిలో జరిగిన సర్వేలో ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వచ్చాయి. లంచం ఇవ్వనిదే పని కావటం లేదనే అభిప్రాయం పలు రాష్ట్రాల్లో వ్యక్తం అయింది. అదే సమయంలో ఏపీలో మాత్రం అవినీతి శాతం గతం కంటే తగ్గింది. జాతీయ స్థాయిలో గతంలో ఏపీ నాల్గవ స్థానంలో ఉండగా...అది 13వ స్థానానికి చేరింది. ఇక, తెలంగాణ దక్షిణాది రాష్ట్రాల్లో అవినీతిలో తొలి స్థానంలో ఉంది. జాతీయ స్థాయిలో ఐదో స్థానం ఉన్నట్లు సర్వేలో తేలింది. మొత్తం 28 రాష్ట్రాల్లో చేసిన ఈ సర్వే నివేదికలో తెలుగు రాష్ట్రాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇండియన కరప్షన్ సర్వే లో ఏ శాఖల్లో అవినీతి ఎక్కువగా ఉందనే విషయాన్ని గుర్తించారు. ఇక ఏపీలో జాతీయ సగటు రేటు కంటే అవినీతి తగ్గినట్లుగా తేల్చారు.
జాతీయ స్థాయిలో ఏపికి 13వ స్థానం..
దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్..కేరళ మాత్రమే జాతీయ స్థాయిలో సగటు అవినీతి రేటు కంటే తక్కువగా నమోదైంది. గతంలో అవినీతి లో ఏపీ 4వ స్థానంలో ఉండగా ఇప్పుడు 13వ స్థానానికి తగ్గింది. ఇక, ఏపీలో జరిగిన ఈ సర్వేలో.. 50 శాతం మంది ఇంకా లంచాలు ఇచ్చే తమ పనులు చేయించుకుంటున్నామని స్పష్టం చేసారు. అందులో 30 శాతం మంది అనేక సార్లు లంచాలు ఇచ్చామని చెప్పగా.. 20 శాతం మంది మాత్రం ఒకటి లేదా రెండు సార్లు ఇచ్చామని చెప్పుకొచ్చారు. 30 శాతం మంది ఎటువంటి లంచాలు ఇవ్వకుండానే సేవలు పొందుతున్నామని స్పష్టం చేసారు.
ఏపీలో ఈ శాఖల్లోనే అవినీతి ఎక్కువగా..
ఏపీలో అవినీతి రేటింగ్ గతం కంటే తగ్గినా..ప్రభుత్వ పరిధిలోని కీలక శాఖల్లో అవినీతి ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో గుర్తించారు. భూమికి సంబంధించి వ్యవహారాలు..రిజిస్ట్రేషన్ల పనుల కోసం 43 శాతం మంది లంచాలు ఇవ్వాల్సి వస్తుందని స్పష్టం చేసారు. అదే విధంగా.. మున్సిపల్ కార్పోరేషన్ లో సేవల కోసం లంచాలు ఇస్తేనే పనులు జరుగుతున్నాయని మరో 21 శాతం మంది తేల్చి చెప్పినట్లు సర్వే స్పష్టం చేస్తోంది. పోలీసు శాఖలో 7 శాతం మంది లంచాలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పగా.. రవాణా..పన్నులు..విద్యుత్ వంటి శాఖల్లో 29 శాతం మంది లంచాలు ఇస్తున్నట్లు సర్వేలో తేల్చి చెప్పారు.
దక్షిణాదిన తెలంగాణ మొదటి స్థానం..
దేశంలో అవినీతి పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం ప్రజలు లంచాలు ఇవ్వాల్సి వస్తూనే ఉంది. లంచాలు ఇస్తే తప్ప పనులు జరగడంలేదని తాజాగా జరిగిన ఓ సర్వే లో తేలింది. ఇందులో తెలంగాణ ఐదో స్థానంలో ఉండటం విశేషం. సర్వేలో లంచం ఇవ్వనిదే పని కావడం లేదని తెలంగాణలోని 67 శాతం మంది చెప్పడం గమనార్హం. చాలాసార్లు లంచం ఇచ్చామని 56 శాతం మంది చెప్పగా, ఒకటి, రెండుసార్లు ఇచ్చినట్లు 11 శాతం మంది వెల్లడించారు. అవినీతిలో దక్షిణాదిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. రెవెన్యూ, మున్సిపల్, పోలీస్శాఖల్లో ఎక్కువ అవినీతి ఉందని, ఇండియా కరప్షన్ సర్వే 2019 నివేదికలో వెల్లడించింది.