మద్యం అక్రమ రవాణాపై ఏపీ ఉక్కుపాదం .. అలా దొరికితే 8 ఏళ్ళ జైలు శిక్ష పడేలా గెజిట్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం నియంత్రణకు వేగంగా అడుగులు వేస్తోంది. మద్యం అక్రమంగా తరలిస్తే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని చట్టాలను మరింత కఠినతరం చేస్తోంది. ఇందులో భాగంగా ఎక్సైజ్ చట్టంలో పలు కీలక సవరణలు చేసి ,స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కు చట్టబద్ధత కల్పించింది ఏపీ ప్రభుత్వం. ఈ ఉత్తర్వులతో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు పవర్స్ ఇవ్వగా, మద్యం అక్రమాలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉండనున్నాయి.
రాష్ట్రంలో ఆ మాట వినిపించకుండా చెయ్యండి ... ఇసుకపై సమీక్షలో సీఎం జగన్
మద్యం అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను మరింత కఠినతరం చేసింది. కఠిన చట్టాలు అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మద్యం అక్రమాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. అందులో భాగంగా నాన్ బెయిలబుల్ కేసులతో పాటు పదే పదే మద్యం అక్రమంగా తరలిస్తూ పట్టుబడితే ఎనిమిదేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా చట్టాలను సవరించారు.
ఇక తాజాగా సవరించిన ఎక్సైజ్ చట్టం 34 ఏ ప్రకారం ఒకే వ్యక్తి పలుమార్లు మద్యం అక్రమాలకు పాల్పడితే 5 నుండి 8 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సాధారణ కేసుల విషయంలో కూడా రెండేళ్లకు తగ్గకుండా శిక్ష పడే విధంగా చట్ట సవరణలు చేసింది. అంతే కాదు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు చట్టబద్ధత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ చర్యతో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ స్థానంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కీలక భూమిక పోషించనుంది.
ఇతర రాష్ట్రాల నుండి మద్యం అక్రమ రవాణా కాకుండా, అలాగే ఏపీలోనూ కల్తీ మద్యం తయారు చేయకుండా, మద్యం అక్రమాలు జరగకుండా అడ్డుకట్ట వేస్తూ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్వతంత్రంగా పని చేయనుంది.దీంతో ఏపీలో మద్య నిషేధానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో కీలక అడుగు వేసినట్లుగా తెలుస్తుంది.