కేంద్రం ఒక్కపైసా ఇవ్వలేదు, ఏపీకి ఏటా రూ. 2,600కోట్ల నష్టం: సభలో గల్లా జయదేవ్
న్యూఢిల్లీ: విభజన చట్టంలోని ఏ అంశాన్ని కేంద్రం ప్రభుత్వం నెరవేర్చడం లేదని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. గురువారం జరిగిన లోక్సభ సమావేశాల్లో టీడీపీ ఎంపీలు విభజన హామీల అమలుపై మాట్లాడారు.
ఈశాన్య రాష్ట్రాల్లాగే.. ఏపీకి..
అశాస్త్రీయ విభజనతో రాష్ట్రం చాలా నష్టపోయిందని, ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తున్న పన్ను రాయితీలు, ప్రోత్సహాకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా గల్లా జయదేవ్ డిమాండ్ చేశారు.
ఏటా ఏపీకి రూ.2600కోట్ల నష్టం
ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రత్యేక విధానం అమలు చేస్తామన్న కేంద్రం.. ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. జీఎస్టీ వల్ల ఏపీ ప్రభుత్వం ఏడాదికి రూ. 2600కోట్లు నష్టపోతోందని అన్నారు.
ఒక్క పైసా కూడా ఇవ్వలేదు
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదని గల్లా జయదేవ్ ఆరోపించారు. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఏపీకి విభజన చట్టం ప్రకారం న్యాయం చేయాలని జయదేవ్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్ లాంటి రాజధాని..
రియల్ ఎస్టేట్పై జీఎస్టీ 5శాతం మాత్రమే ఉండాలని, ఎండుమిర్చి, చింతపండు, పసుపు పంటలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని జయదేవ్ కోరారు. హైదరాబాద్ లాంటి ఆదాయ వనరు గల రాజధాని ఏపీకి కావాలని అన్నారు.