అవి సరే, ఇక్కడ మాత్రం తెలంగాణ రైట్: ఎపి ప్రభుత్వం
హైదరాబాద్: కృష్ణా జలాలపై తెలంగాణ చేసిన ఆరోపణలను ఖండించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్మట్టి విషయంలో మాత్రం సమర్థించింది. ఆల్మట్టి ఎత్తు పెంపునకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనుమతించడం వల్ల దిగువ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే తెలంగాణ వాదనను ఎపి ప్రభుత్వం సమర్థించింది. కేంద్ర జలనవరుల సంఘానికి రాసిన లేఖలో ఎపి ప్రభుత్వం ఆ విషయం చెప్పింది.
కృష్ణా జలాల పంపిణీలో బచావత్ ట్రిబ్యునల్లోనూ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లోనూ తీవ్ర అన్యాయం జరిగిందని, తెలంగాణ ప్రజలకు అనుగుణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో వాదనలు వినిపించలేదని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు నిరుడు జులైలో రాసిన లేఖలో తెలంగాణ ప్రభుత్వం వాదించింది. తమకు న్యాయం చేసేందుకు కొత్తగా ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని లేదా గడుపు పొడగించిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు ఈ అంశాన్ని అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.
దీనిపై అభిప్రాయం చెప్పాలని గత నెలలో కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన లేఖకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం పంపించింది. ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేదని, గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాల్లో కూడా తెలంగాణ సైతం భాగస్వామి అని సమాధానం ఇచ్చింది.
ఆల్మట్టి విషయంలో మాత్రం తెలంగాణ వాదనతో ఏకీభవించింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆల్మట్టి ఎత్తును 524.256 మీటర్లకు అనుతించడం వల్ల దిగువ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే తెలంగాణ వాదన సరైందేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.