చిరిగిన ‘బాబు’ ముఖం: ఎమ్మెల్యే చింతమనేని వీరంగం, వ్యక్తిపై దాడి, కేసు నమోదు
Recommended Video
విజయవాడ: ఎప్పుడూ వివాదాలతో సహవాసం చేసే రాష్ట్ర ప్రభుత్వ విప్, దెందులూరు శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ హనుమాన్జంక్షన్లో వీరంగం సృష్టించారు. ఆయన ఏలూరు నుంచి విజయవాడకు వెళ్లే క్రమంలో మంగళవారం ఇక్కడకు వచ్చారు.
అదే సమయంలో జంక్షన్ నుంచి గుడివాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు మీద ఉన్న సంక్షేమ పథకాల ప్రకటనలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్రం చిరిగి ఉండటాన్ని గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసభ్య పదజాలంతో..
డ్రైవరు, కండక్టరులను కిందకు దింపి అసభ్య పదజాలంతో దూషించారు. డిపోకు వెళ్లగానే సరిచేయిస్తామని వారు చెబుతున్నా.. వినకుండా బస్సులో ప్రయాణికులను దింపి వేరే బస్సులోకి ఎక్కించాలని ఆదేశించారు.
ప్రశ్నించిన వ్యక్తిపై ఎమ్మెల్యే దాడి
ఇదంతా గమనిస్తున్న స్థానికుడు గరికపాటి నాగేశ్వరరావు అనవసరంగా సిబ్బందిని వేధించడం ఎందుకని ప్రశ్నించేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహించిన చింతమనేని.. అతనిపై చేయి చేసుకున్నారు.
బస్సు నుంచి దించేశారు..
సమాచారం తెలిసి జంక్షన్ ఎస్సై సతీష్ ఘటనా స్థలానికి వచ్చి ప్రభుత్వ విప్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. చివరకు ప్రయాణికులను బస్సు దింపి వేరే బస్సుల్లో పంపారు. అనంతరం చింతమనేనివిజయవాడ వైపు వెళ్లి పోయారు.
ఎమ్మెల్యేపై.. బాధితుడి ధర్నా
కాగా, నాగేశ్వరరావుపై దాడి విషయం అతని స్నేహితులు, సామాజిక వర్గీయులకు తెలియడంతో వారు అభయాంజనేయస్వామి దేవాలయం వద్ద గుమిగూడారు. ఎమ్మెల్యే దాడికి నిరసన ధర్నా చేశారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే చింతమనేనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఘటనపై రెండు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.