ఏపి బీజేపిలోకి బ్రేక్ పడిన చేరికలు.. కాషాయాన్ని కాదంటున్న తమ్ముళ్లు..! కారణం అదేనా..?
అమరావతి/హైదరాబాద్ : కమలనాథులు విసురుతున్న వలకు టీడిపి నేతలు చిక్కినట్టే చిక్కి జారిపోతున్నారు. టీడీపీ నేతలు టచ్లోకి వచ్చి, తిరిగి వెనక్కి వెళుతున్నారు. మాటలయితే కలుపుతున్నారు గానీ, పార్టీ మారడానికి మాత్రం వెనకాడుతున్నారు. కాషాయం శాలువా కప్పుకునేందుకు వెనకాముందు ఆలోచిస్తున్నారు. చిక్కినట్టే చిక్కి చేజారుతున్న నేతలపై బీజేపీ హైకమాండ్ దృష్టిసారించింది. ఎందుకిలా జరుగుతుందని ఆరాతీస్తోంది. నెల రోజుల క్రితం పార్టీ మారేందుకు పచ్చజెండా ఊపిన కొంతమంది టీడీపీ నేతలు వెనక్కి తగ్గడంపై ఆసక్తికర చర్చే జరుగుతోంది.
Recommended Video
ఏపి టీడిపి పై షోకస్ పెట్టిన బీజేపి..! చేరికలకు బ్రేక్ ఇచ్చిన తమ్ముళ్లు..!!
మొన్నటి ఎన్నికల్లో 23 స్థానాలకే పరిమితమైన తెలుగుదేశం పార్టీ నేతలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారు. ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి రావాలంటే రాజీనామాలు చేయాల్సిందేననీ, లేనిపక్షంలో ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వేటు తప్పదనీ శాసనసభ సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా ప్రకటించారు. అంతేకాదు- తాము తలుపులు తెరిస్తే వచ్చేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారంటూ అసెంబ్లీలోనే ఆయన వ్యాఖ్యానించారు.
నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపిలోకి..! ఉత్సాహంగా కనిపించిన కలమలం..!!
ఇదిలా ఉంటే, బీజేపీ నేతలు మాత్రం వలసలకి తలుపులు తెరిచే ఉంచారు. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీని వీడటంతో ఏపీలో కూడా పలువురి నేతల చేరికలపై ఊహాగానాలు హల్చల్ చేశాయి. ఎమ్మెల్యేలు పార్టీ మారాలంటే దాదాపుగా 17 మంది వరకు ఒకేసారి బయటకొచ్చి ప్రత్యేక గ్రూప్గా తమను పరిగణించాలని అసెంబ్లీ స్పీకర్ను కోరాల్సి ఉంటుంది. వేరువేరుగా ఎవరైన బయటకొస్తే వేటు తప్పదని సీఎం జగన్ హెచ్చరించడంతో పరిస్థితి తమకు ప్రతిబంధకంగా మారిందని బీజేపీ నేతలు చెబుతున్నారు.
టీడిపి ఖాళీ అవ్వడం ఖాయమన్న బీజేపి..! అడ్డుకట్ట వేసిన చంద్రబాబు..!!
తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ నేతలు, ముఖ్యంగా రాయలసీమకు చెందిన నేతలు బీజేపీలో చేరతారంటూ తొలుత విస్తృతంగా ప్రచారం జరిగింది. ఎప్పటినుంచో టీడీపీలో ఉంటున్న సీమ నేతల కుటుంబాలు పార్టీ మారవచ్చంటూ వార్తలు వెలువడ్డాయి. అయితే వారు బీజేపీ పెద్దలకి టచ్లోకి వచ్చి మళ్లీ వెనక్కి జారుకున్నారట. ఎందుకిలా జరిగిందన్న అంశమే బీజేపీ నేతలకు అంతుబట్టడం లేదు. దీనిపై ఆ పార్టీ అగ్రనేతలు లోతుగా ఆరాతీస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇటీవల ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో పర్యటించారు. వైసీపీ నేతల దాడిలో మరణించిన, గాయపడిన కుటుంబాల వారిని ఆయన పరామర్శించారు. వారికి ఆర్థిక సాయం చేసి ధైర్యంచెప్పడంతో పాటు కొండంత భరోసా కల్పించారు. ఈ సమయంలో చంద్రబాబు పర్యటనకు విశేష స్పందన వచ్చింది. ఈ పరిణామాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు కూడా గమనించారు.
చంద్రబాబు పై తమ్ముళ్ల విశ్వాసం..! మరికొన్ని రోజులు వేచిచూసే దోరణి..!!
గతానికి భిన్నంగా పార్టీ కార్యకర్తలను చంద్రబాబు విరామం లేకుండా కలుసుకోవడం, వారితో ఆప్యాయంగా మాట్లాడటం వంటి అంశాలు క్యాడర్నీ, నేతలనీ ప్రభావితం చేస్తున్నాయన్న చర్చ కూడా సాగుతోంది. దీనికితోడు ప్రతిరోజు గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధినేత అందుబాటులో ఉండటం కార్యకర్తలకు ఊరటనిస్తోందని ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు తమకంటే ఆరోగ్యంగానే ఉన్నారంటూ ఆ పార్టీ నేతలు అసెంబ్లీ లాబీల్లో, పార్టీ కార్యాలయంలో జరిగే చర్చల్లో కితాబు ఇస్తున్నారు. ఈ పరిస్థితులన్నింటినీ పరిశీలించిన మీదటే పార్టీని వీడాలని భావించిన కొంతమంది టీడీపీ నేతలు వెనక్కి తగ్గారన్నది బీజేపీ నేతల తాజా విశ్లేషణ. టీడీపీ ఖాళీ అవుతుందంటూ మీడియా ముఖంగా బీజేపీ నేతలు చెబుతున్నప్పటికీ, అందుకనుగుణంగా చేరికలు మాత్రం జరగడంలేదని కమలనాథులే ఆప్ ద రికార్డ్ చెప్తున్నారు.