'ఏపీ వ్యతిరేకి టీఆర్ఎస్ గెలిస్తే పవన్, జగన్ సంబరాలా?, కేసీఆర్కు ధైర్యం ఉందా'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్కు వెళ్తానని, చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై ఏపీ టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఏపీ మంత్రి ఫరూక్, కాంగ్రెస్ నేత కిల్లి కృపారాణి, ఏపీ సీఎం చంద్రబాబు తదితరులు స్పందించారు. ఎవరైనా ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చునని చెప్పారు. మరికొందరు గెలవగానే ఇలాంటి వ్యాఖ్యలు ఏమిటని దుమ్మెత్తి పోస్తున్నారు. అదే సమయంలో వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ పైనా విమర్శలు గుప్పిస్తున్నారు.
రెండోసారి తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ (ఫోటోలు)
తాజాగా, మంత్రులు పితాని సత్యనారాయణ, నక్కా ఆనంద్ బాబులు విమర్శలు గుప్పించారు. కేసీఆర్కు ధైర్యం ఉంటే ఏపీ రాజకీయాల్లోకి నేరుగా అడుగు పెట్టాలని ఆనంద్ బాబు సవాల్ విసిరారు. ఏపీలోకి వస్తామని మాటలు చెప్పడం కాదని, ధైర్యంగా రావాలన్నారు. వైసీపీ, జనసేనలతో తెలంగాణలో చేసిన తెరచాటు రాజకీయాలు కాకుండా బహిరంగంగా కలిసి రావాలన్నారు.
జగన్ ఏపీ వ్యతిరేకులతో చేతులు కలుపుతావా?
టీఆర్ఎస్ పార్టీ కారుకు.. బీజేపీ, వైసీపీ, జనసేన, మజ్లిస్ అనేవి నాలుగు చక్రాలు ఉన్నాయని నక్కా ఆనంద్ బాబు ఎద్దేవా చేశారు. జగన్కు ఎప్పుడూ రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని ఆరోపించారు. అందుకే ఆంధ్రప్రదేశ్ వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతారన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ గెలిస్తే ఇక్కడ జనసేన, వైసీపీ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణలో బినామీ ఆస్తులను సంరక్షించుకోవడానికే జగన్ తెరాసతో మంచి సంబంధాలు నెరపుతున్నారన్నారు.
ఎన్నికల్లో గెలవగానే హీరోలు కాదు
ఎన్నికల్లో గెలవగానే ఎవరూ హీరోలు కారని మరో మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. నేతల తలరాతలు, గెలుపోటములు నిర్ణయించాల్సింది ప్రజలే అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఏపీలోకి రావొద్దని తాము ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందని చెప్పారు. దివంగత ఇందిరాగాంధీ ఉమ్మడి ఏపీ నుంచి పోటీ చేశారనీ, మాజీ ప్రధాని వీపీ నరసింహారావు కర్ణాటక నుంచి పోటీ చేశారని గుర్తు చేశారు.
జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్తో, ఏపీపై నిర్ణయం తీసుకోలేదు
చంద్రబాబు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేస్తే కొందరు నేతలు మాత్రం పార్టీలు పెట్టుకుని కూడా ప్రచారం చేయలేకపోయరారని వైసీపీ, జనసేలను ఉద్దేశించి పితాని అన్నారు. ఏపీలో కుర్చీలు, ఆఫీసులు కూడా లేని పరిస్థితుల్లో చంద్రబాబును రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారన్నారు. ఏపీ కోసం జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ లేదా బీజేపీతో చేతులు కలపక తప్పదన్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఎవరివల్ల ఎవరు నష్టపోయారో ఇప్పుడే చెప్పలేమని అన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో కలిసి ముందుకు వెళ్తామని, ఏపీ విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు.
జగన్, పవన్ సంబరాలు చేసుకోవడం ఏమిటి?
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే జగన్, పవన్ కళ్యాణ్లు సంబరాలు చేసుకోవడం విచిత్రంగా ఉందని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వవద్దని చెప్పిన తెరాస గెలిస్తే పవన్, జగన్ సంబరాలు చేసుకోవడమా అన్నారు. రాష్ట్ర విభజన వల్ల ఏపీ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోందని చెప్పారు. హైదరాబాద్లోని పాతబస్తీలో అభివృద్ధి లేదని, వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు రావన్నారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి ప్రజలకు వివరిస్తామని, మళ్లీ టీడీపీయే గెలుస్తుందన్నారు.