వైసీపీది రాక్షస పాలన ... దేశంలో మరెక్కడా లేదు .. గవర్నర్ కు టీడీపీ నేతల ఫిర్యాదు
Recommended Video
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి టిడిపి నేతలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని టిడిపి నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అరాచక పాలన కొనసాగిస్తుందని, ఇలాంటి రాక్షస పాలన దేశంలో మరెక్కడా లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టిడిపి నేతలు నేడు ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ను కలిసి ఫిర్యాదు చేశారు.
చిత్తూరులో ఆ మంత్రి బర్త్ డే వేడుకలు..పోటీ పడి చేసిన వైసీపీ నేతలు..కారణం ఇదే
ఏపీ గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ ను రాజ్ భవన్ లో కలిసిన టిడిపి నేతలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ వైయస్ఆర్సిపి ప్రభుత్వంపై వారు ఫిర్యాదు చేశారు. టిడిపి నాయకులు, కార్యకర్తలపై వైసిపి ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తుందని, ఏపీలో టీడీపీ నేతలపై దాడులు ఎక్కువయ్యాయని ఆయనకు ఫిర్యాదు చేశారు. ఇక గవర్నర్ ను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు టిడిపి నేతలు.
ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, ఇలాంటి రాక్షస పాలన దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడా ఉండదని ఆయన పేర్కొన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరును నిరసిస్తూ తాము గవర్నర్ హరిచందన్ కు ఫిర్యాదు చేశామని చెప్పుకొచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులు పెచ్చుమీరి పోతున్నాయని, టిడిపి నేతలను వైసిపి ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుందని ఎంపీ కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక ఏపీ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను సైతం తమకు అనుకూలంగా మార్చుకుంటుందని, ఇక పోలీస్ వ్యవస్థ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రవర్తిస్తున్న తీరు చూస్తే ఎక్కడ సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంది అని ఆయన పేర్కొన్నారు. ఇక జగన్ ఢిల్లీ పర్యటన పై వ్యాఖ్యలు చేసిన కేశినేని నాని సీఎం జగన్ ఢిల్లీ వెళ్లింది తనపై ఉన్న కేసులను మాఫీ చేయించుకోవడం కోసమే అని ఆరోపణలు గుప్పించారు. ఇక ఏపీ అన్నిరకాలుగా వైసిపి పాలనలో బ్రష్టు పడుతుందని కేశినేని నాని విమర్శలు చేశారు.