మీరెవరు?: కేంద్రమంత్రి ఎదుటే జీవీఎల్, టీడీపీ నేతల వాగ్వాదం, ధర్నా, బాబు మండిపాటు
న్యూఢిల్లీ: రైల్వే జోన్ అంశంపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్తో మంగళవారం జరిగిన టీడీపీ ఉత్తరాంధ్ర ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశం రసాబాసగా ముగిసింది. సమావేశంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావుతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు.
రైల్వే జోన్ అంశంపై స్పష్టత ఇవ్వాలంటూ కేంద్రమంత్రి పీయూష్ గోయల్ను టీడీపీ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. దీంతో బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు కల్పించుకుని మాట్లాడారు.
జీవీఎల్ జోక్యంపై టీడీపీ నేతల ఆగ్రహం
జీవీఎల్ జోక్యం చేసుకోవడంపై టీడీపీ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కేంద్రమంత్రిని సమాధానం అడుగుతుంటే మీరెందుకు? స్పందిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. కళావెంకట్రావ్.. జీవీఎల్తో వాగ్వాదానికి దిగారు. దీంతో కొంత గందరగోళం నెకలొంది. వెంటనే ఎంపీ హరిబాబు కలగజేసుకుని ఇరువర్గాలకు సర్ధిచెప్పారు.
గోయల్ వివరణ
నాలుగేళ్లయినా రైల్వేజోన్ ఎందుకు ఇవ్వలేదని ఈ సందర్భంగా కేరంద్రమంత్రిని టీడీపీ నేతలు ప్రశ్నించారు. రైల్వేజోన్ ఎప్పుడిస్తారో నిర్దిష్ట గడువు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. వీరి డిమాండ్కు స్పందించిన పీయూష్ గోయల్.. టాస్క్ఫోర్స్ కమిటీ నివేదిక అనంతరం.. రైల్వేజోన్పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
టీడీపీ నేతల ధర్నా
దీనికి సంతృప్తి చెందని ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు పీయూష్ గోయల్ ఆఫీసు ఎదుట సుమారు రెండుగంటలపాటు ధర్నాకు దిగారు. కేంద్రమంత్రి నుంచి స్పష్టమైన ప్రకటన ఏమీ రాలేదని టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు.
చంద్రబాబు మండిపాటు
కాగా, జీవీఎల్ తీరును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు టీడీపీ నేతలు వివరించారు. దీంతో ఈ ఘటనను తేలికగా తీసుకోవద్దని చంద్రబాబు వారికి సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ పోరాడుతుంటే బీజేపీ అడ్డుకుంటోందని, ఇందుకు ఇదే నిదర్శనమని చంద్రబాబు అన్నారు.