కేంద్రంపై అవిశ్వాసం, ప్రత్యేక హోదా: టీఆర్ఎస్ ఎంపీలను కలిసిన టీడీపీ ఎంపీలు
హైదరాబాద్: విభజన హామీలపై ఏపీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలను కలవనున్నారు. ప్రత్యేక హోదా, ఏపీకి జరిగిన అన్యాయాన్ని అన్ని పార్టీల నేతలకు వివరించనున్నారు. ఆదివారం సాయంత్రం ముంబైలో శివసేన అధినేత ఉద్ధవా థాకరే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్లను కలుస్తారు.
అలాగే, డీఎంకే, అన్నాడీఎంకే నేతలను రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ కలవనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును అశోక్ గజపతి రాజు, కొనకళ్ల నారాయణ, శివప్రసాద్లు కలుస్తారని వార్తలు వచ్చాయి. అయితే కొనకళ్ల, సుజనాలు తెరాస ఎంపీలను కలిశారు.
ఏపీకి జరిగిన అన్యాయం గురించి వివిధ పార్టీలకు చెబుతాం: సుజనా
ఏపీకి జరిగిన అన్యాయంపై ఏపీ టీడీపీ నేతలు వివిధ పార్టీల నేతలను కలుస్తున్నారు. తెరాస ఎంపీలు కె కేశవరావు, జితేందర్ రెడ్డిలను టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, శ్రీరామ్ మాల్యాద్రి కలిశారు.
విభజన హామీల అమలుకు పార్లమెంట్ సమావేశాల్లో పోరాటం చేస్తామని, తమకు మద్దతుగా నిలవాలని కేకేను కోరారు. ఆ తర్వాత సుజనా మాట్లాడారు. ఏపీకి జరిగిన అన్యాయం, విభజన హామీల అమలుపై చర్చించామన్నారు.
ఏపీకి అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని తెరాస నేతలు అంగీకరించారని, త్వరలో జరగబోయే అఖిలపక్ష భేటీలో ఈ అంశాన్ని లేవనెత్తాలని కోరామన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై అవిశ్వాసతీర్మానం పెడతామని, ఇందుకు తెరాస మద్దతు కోరగా అందుకు సానుకూలంగా స్పందించిందన్నారు.