ఏపీ పంచాయతీ ఎన్నికలు: తీర్పును స్వాగతించిన అచ్చెన్నాయుడు, భయపడం: విశ్వరూప్
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. దీంతో ఎస్ఈసీ అధికారులతో సమీక్ష జరుపుతున్నారు. ఇటు హైకోర్టు తీర్పును టీడీపీ నేతలు స్వాగతించారు. ఎన్నికలు నిర్వహించాలని ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని టీడీపీ నేతలు అంటున్నారు. ప్రభుత్వ తీరును ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తప్పుపట్టారు.
వెల్ కం..
పంచాయితీ ఎన్నికలపై హైకోర్టు తీర్పుపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. హైకోర్టు ధర్మాసనం తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఎన్నికలు జరగాల్సి ఉందని చెప్పారు. తమకు ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్నారు. ఏపీలో పోలీస్ వ్యవస్థ వైసీపీ వ్యవస్థలా పనిచేస్తోందని విమర్శించారు. ఇదీ అందరికీ తెలుసు అని చెప్పారు.
Recommended Video
ఆన్లైన్లో తీసుకునేలా చర్యలు..
పంచాయితీ నామినేషన్లు ఆన్లైన్లో తీసుకునేలా చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు సూచించారు. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పును సవాల్ చేయొద్దుని.. ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్లాలని భావిస్తే సిగ్గుచేటని విమర్శించారు. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ఇతర నేతలు కూడా హైకోర్టు తీర్పును స్వాగతించారు.
సింగిల్గా ఉన్నప్పుడే భయపడలేదు
ఇలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టుకి వెళ్తామని మంత్రి విశ్వరూప్ పేర్కొన్నారు. హైకోర్టు తీర్పుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు తమకు అధికారం ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని..ఇందులో రాజీ పడాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. రాజకీయాలు పక్కన పెట్టి.. జనం కోసం పాటుపడుతున్నామని చెప్పారు. సింగిల్గా ఉన్నప్పుడే ఎన్నికలకి సీఎం జగన్ భయపడలేదని మంత్రి విశ్వరూప్ పేర్కొన్నారు. ఇప్పుడు అదిరేదీ లేదని చెప్పారు.
ఇదీ వివాదం..
ఏపీలో ఎస్ఈసీ వర్సెస్ సర్కార్ వార్ జరుగుతోంది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా గత ఏడాది ఎన్నికలకు నిమ్మగడ్డ వాయిదా వేయడంతో వివాదం చెలరేగింది. ఆయనను తప్పించడం.. కొత్త ఎస్ఈసీ నియమించడం కూడా జరిగిపోయింది. అయితే హైకోర్టు జోక్యంతో.. తిరిగి నిమ్మగడ్డ పదవీ చేపట్టారు. మార్చిలో ఆయన పదవీకాలం ముగియనుంది. అప్పటివరకు ఎన్నికలు నిర్వహించొద్దు అని జగన్ సర్కార్ భీష్మించుకొని కూర్చొంది. కానీ ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ పట్టుబడుతున్నారు. దీంతో వివాదం కంటిన్యూ అవుతూనే ఉంది.