ఇళ్ళస్థలాల విషయంలో వైసీపీ మంత్రులకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సవాల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా ఇల్లు నా సొంతం, నా ఇంటి స్థలం నాకు ఇవ్వాలి అన్న నినాదంతో ఆందోళనకు శ్రీకారం చుట్టింది టిడిపి . మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో గృహాలు లబ్ధిదారులకు ఇవ్వాలంటూ నిరసనలు చేపడుతున్నట్లు తెలిపారు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. అంతేకాదు ఇళ్ల లబ్ధిదారులతో టిడిపి నేతలు భేటీ నిర్వహిస్తారని పేర్కొన్నారు. 7న ఇళ్ల లబ్ధిదారులతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, 8న నియోజకవర్గాల్లో ఆందోళనలు , ప్రెస్ మీట్లకు పిలుపు ఇచ్చినట్లుగా తెలిపారు.
మాజీ మంత్రి దేవినేని ఉమపై కేసు నమోదు..బెదిరింపు ఫిర్యాదులు
సంక్రాంతి నాటికి ఇళ్ళు ఇవ్వకుంటే తామే గృహాలను పేదలకు స్వాధీనం చేస్తామన్న అచ్చెన్న
సంక్రాంతి నాటికి టిడ్కో గృహాలను పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న అచ్చెన్నాయుడు, అలా జరగని పక్షంలో తామే గృహాలను పేదలకు స్వాధీనం చేస్తామని పేర్కొన్నారు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తామంటే చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారని , కోర్టులో కేసులు వేసి ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా చేస్తున్నారని వైసీపీ మంత్రులు తెలుగుదేశం నేతలపై చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఇళ్ళపట్టాలపై టీడీపీకి చెందిన ఏ ఒక్క సభ్యుడైన కోర్టులకు వెళ్ళినట్లుగా నిరూపించాలని ఛాలెంజ్
టీడీపీకి చెందిన ఏ ఒక్క సభ్యుడైన కోర్టులకు వెళ్ళినట్లుగా నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. ఇళ్ల పట్టాల పేరుతో ఇప్పటివరకు ఐదు వేల కోట్లు కొట్టేశారు అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. చేతగాక టిడిపి నాయకులపై అవాకులు చెవాకులు పేలుతున్నారు అంటూ ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల భూములను అడ్డగోలుగా తీసుకుందని, దాంతో వాళ్లు కోర్టుకు వెళ్లారని పేర్కొన్న అచ్చెన్నాయుడు , కొంత మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు అంటూ మాట్లాడారు.
సీఎంకు చెప్పే ధైర్యం లేకనే టీడీపీ మీద విమర్శలు
ఇక అధికార పార్టీనే వైసీపీకి చెందిన జడ్పీటీసీలు ఎంపీలతో కేసులు వేయించిందని , ఆ ఆధారాలు తమ వద్ద ఉన్నాయంటూ అచ్చెన్నాయుడు తెలిపారు.ఇళ్ల పట్టాలను టీడీపీ అడ్డుకుంటుందని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. మంత్రులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో మాట్లాడే ధైర్యం లేదని ఎద్దేవా చేసిన అచ్చెన్నాయుడు, రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు సిఎంకు చెప్పే శక్తి లేక టీడీపీపై విమర్శలు చేస్తున్నారంటూ పేర్కొన్నారు.