మళ్లీ సింగపూర్ జపం : ఎస్సీ గురుకుల టీచర్లను సింగపూర్కు పంపనున్న ఏపీ ప్రభుత్వం
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గురుకులాల్లో చదివే విద్యార్థులపై ప్రత్యేక దృఫ్టి సారించింది. వారికి నాణ్యమైన విద్యను అందించేందుకు అడుగులు ముందుకేస్తోంది. ఇందులో భాగంగా అన్ని ఎస్సీ గురుకులాల్లో పదవ తరగతిలో 100శాతం ఫలితాలు విద్యార్థులు సాధించాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది. అంతేకాదు పోటీ పరీక్షల్లో కూడా ఏపీ విద్యార్థులు ముందువరసలో ఉండేందుకు కావాల్సిన శిక్షణ విద్యార్థులకు ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.
గురుకులాలకు చెందిన పదవ తరగతి ద్యార్థులు పాస్ అవుతున్నప్పటికీ పదికి పది జీపీఏ సాధిస్తున్న విద్యార్థులు సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. 2016-17లో 10 మందికి, 2017-18లో 53 మందికి మాత్రమే పదికి పది జీపీఏ వచ్చింది. ఇది పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం బాగా చదివే విద్యార్థులను డల్గా ఉండే విద్యార్థులను విభజించి... చురుకైన విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చి మెరికల్లా తయారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే 175 ఎస్సీ గురుకులాల నుంచి 1750 మంది విద్యార్థులను ప్రభుత్వం ఎంపికచేసింది. వీరికి ఆయా సబ్జెక్ట్ నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. ఇక పాస్ మార్కులు కూడా తెచ్చుకోలేని విద్యార్థులను కూడా గుర్తించి వారు ఎలాగైనా పాస్ అయ్యేలా వీరిని తీర్చిదిద్దుతారు.
అనంతపురం జిల్లాలో అయితే అక్కడి గురుకులాల్లో కొరియా భాష కూడా నేర్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకు కారణం అక్కడ కొరియా సంస్థ కియా మోటార్స్ను ఏర్పాటు చేసింది. ఆ సంస్థలో పనిచేసేవారికి కొరియన్ భాష అవసరముందని గురుకులం సొసైటీ అధికారులు గుర్తించడంతో ఆ జిల్లాలోని గురుకుల పాఠశాలలలో విద్యార్థులకు కొరియన్ భాష నేర్పించే కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. మరోవైపు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న 25 మంది టీచర్లను ఫిబ్రవరిలో సింగపూర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్కు పంపించి శిక్షణ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్దం చేసింది.