బద్రి మృతికి బాబు, కేసీఆర్, చిరు సంతాపం: బెజవాడకు ఫ్యామిలీ తరలింపు
హైదరాబాద్: ప్రముఖ న్యూస్ రీడర్ బద్రి ఆదివారం ఉదయం ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. బద్రి ఆకస్మిక మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఏపీపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి, వైసీపీ చీఫ్ వైయస్ జగన్ సంతాపం తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో బద్రి మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. బద్రి టీవీ 9లో న్యూస్ రీడర్. ఆయన భార్య లక్ష్మీ సుజాత, ఇద్దరు కుమారులు, సోదరుడికి మెరుగైన చికిత్స కోసం అధికారులు విజయవాడకు తరలించారు. మొదట వారిని ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉత్తమ చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు. బద్రి బంధువు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
కాగా, ప్రముఖ న్యూస్ రీడర్ బద్రి ఆదివారం ఉదయం దుర్మరణం చెందారు. బద్రి తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తుండగా జిల్లాలోని ద్వారకా తిరుమల సమీంలో కారు టైర్ పేలి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బద్రి అక్కడికక్కడే మృతి చెందారు.
అతని భార్య, పిల్లలకు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు గాయపడిన వారిని ఏలూరులో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వీరు వెనుక సీటులో కూర్చున్నారు. ప్రమాదం సమయంలో ముందు సీటులో ఉన్న బద్రి చెట్టుకు ఢీకొనడంతో మృతి చెందారు.