ఏపీ, తెలంగాణ 'పవర్' పోటీ: వేగంగా తగ్గుతున్న శ్రీశైలం నీటిమట్టం
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పోటాపోటీగా విద్యుదుత్పత్తి చేస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం వేగంగా తగ్గుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎండాకాలం వస్తుండటంతో ఇరు రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తి కోసం ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇందులో భాగంగా ఎడమ గట్టు కేంద్రం వద్ద తెలంగాణ రాష్ట్రం, కుడిగట్టు కేంద్రం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఇంకా చెప్పాలంటే.. ఇరు రాష్ట్రాలు కూడా పోటాపోటీగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
దీంతో శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం వేగంగా పడిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు కింద సాగు చేస్తున్న రైతుల్లో ఈ ఆందోళన కనిపిస్తోంది. వేసవిలో విద్యుత్కు బాగా డిమాండ్ ఉంటుంది. దీంతో ఇరు రాష్ట్రాలు పోటాపోటీగా ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయని అంటున్నారు.
ప్రస్తుతం నీటిమట్టం 805 అడుగులు ఉంది. మరో ఐదు లేదా అటు ఇటుగా టీఎంసీలను ఉత్పత్తి కోసం వినియోగించుకోవచ్చు. అయితే, ఇలా తెలుగు రాష్ట్రాలు పోటీగా విద్యుత్ ఉత్పత్తి చేస్తే నీటిమట్టం మరింత తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.