హోదా కోసం వైసిపి ఆందోళన, తోట ఆగ్రహం, తెలంగాణకూ: బిజెపికి జితేందర్
న్యూఢిల్లీ: రాజకీయ ప్రయోజనం కోసమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా విషయమై సభను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందని తెలుగుదేశం పార్టీ ఎంపీ తోట నర్సింహం అన్నారు. గురువారం నాడు లోకసభలో వైసిపి ఎంపీలు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అడ్డుకునే ప్రయత్నాలు చేశారు.
దీనిపై తోట నర్సింహం స్పందించారు. రాజకీయం కోసం సభను అడ్డుకోవడం సరికాదని అన్నారు. ప్రజా సమస్యల పైన చర్చకు అందరూ చొరవ చూపాలన్నారు. సభను అడ్డుకుంటే ప్రజాధనం వృథా అవుతుందని చెప్పారు. విభజన నష్టాన్ని తాము ఎప్పటిప్పుడు కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తున్నట్లు చెప్పారు.
ఇప్పటికే కేంద్రం ఏపీకి అనేక సంస్థలను మంజూరు చేసిందని, ఇంకా వస్తాయని చెప్పారు. నిధుల సహకారం కూడా వస్తోందన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా ప్రత్యేక హోదా కోరుకుంటోందన్నారు. అయితే సభను అడ్డుకోవడం సరికాదన్నారు.
మాకూ ఇవ్వండి: జితేందర్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వాలని టిఆర్ఎస్ ఎంపీ జితేందర్ గురువారం డిమాండ్ చేశారు. జితేందర్ రెడ్డి తెలంగాణకు ప్రత్యేక హోదా అంశాన్ని లోకసభలో లేవనెత్తారు. ఆర్థిక లోటులో చిక్కుకున్న ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తమకేమీ అభ్యంతరం లేదని, అయితే, కొత్త రాష్ట్రమైన తమకూ ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు.
అంతకుముందు, వైసిపి నేతలు ఏపీకి ప్రత్యేక హాదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ... బిజెపి ఉద్దేశ్యపూర్వకంగానే హోదా అంశాన్ని పక్కన పెట్టిందని ఆరోపించారు. వెంటనే హోదా ఇవ్వాలన్నారు.