బెజవాడలో నాయిని, జ్ఞాపిక ఇచ్చిన బాబు: రాజ్నాథ్ ఎదుట 'విభజన'
విజయవాడ: దేశ అభివృద్ధికి సహకార సమాఖ్య స్ఫూర్తి చాలా ముఖ్యమని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం అన్నారు. రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు వెళ్లేందుకు ప్రాంతీయ మండళ్లు చోదక శక్తులుగా పని చేస్తాయన్నారు.
శనివారం నాడు విజయవాడలోని గేట్ వే హోటల్లో జరిగిన 26వ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశానికి రాజ్ నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కర్నాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల ప్రతినిధులు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.... తమ ప్రభుత్వం మొదటి నుంచీ ప్రాంతీయ మండళ్లు, అంతర్రాష్ట్ర మండళ్ల బలోపేతానికి అత్యధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య, వివిధ రాష్ట్రాల మధ్య విస్తృత సహకారానికి అడ్డంకిగా ఉన్న సమస్యల్ని సుహృద్భావ వాతావరణంలో చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు ఈ మండళ్లు ఎంతో తోడ్పడతాయన్నారు.
ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ... రాష్ట్ర విభజన తర్వాత అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని, కనీస మౌలిక వసతులు కూడా లేకపోవడంతో వచ్చిన అతిథులకు మంచి వసతి కూడా కల్పించలేకపోయామని విచారం వ్యక్తం చేశారు.
వివాదాల వల్ల నష్టమే తప్ప లాభం లేదని, అభివృద్ధిపై దృష్టి సారించలేమని, అంతర్రాష్ట్ర వివాదాల్ని సామరస్యంగా, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. టీమిండియాలో ఐకమత్యంతో పని చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుని అందిపుచ్చుకుని మనం ముందుకు వెళుతున్నామన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పలు సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించుకునే క్రమంలో ఉన్నామన్నారు. కాగా, ఈ భేటీలో రాష్ట్ర విభజన నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అవసరాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు చెప్పాయి.
అమరావతి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ని కలుపుతూ హైస్పీడ్ రైలు కారిడార్ ఏర్పాటు చేయాలని, సాధాసాధ్యాలపై రైల్వేశాఖ అధ్యయనం చేయాలని చంద్రబాబు కోరారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి సహకరించాలని కోరారు.
ప్రతి సంవత్సరంలో ఒకసారైనా ప్రాంతీయ మండలి సమావేశం జరిపి తీరాలని, వచ్చే సమావేశం కేరళ రాజధాని తిరువనంతపురంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఇది వరకు ప్రాంతీయ మండలి సమావేశం 2012 నవంబరు 16న జరిగింది.
ఒడిశా, ఛత్తీస్గడ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో కేంద్ర బలగాలను పెంచాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. కృష్ణపట్నం పోర్టుని కీలక ప్రాంతంగా చేసుకుంటూ చెన్నైబెంగళూరు పారిశ్రామిక కారిడార్ని వేగవంతం చేయాలని, భూసేకరణ ఖర్చు కూడా కేంద్రమే భరించాలని ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలు కోరాయి.
విభజన తర్వాత కొన్ని సరిహద్దు మండలాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే, నియోజకవర్గ కేంద్రం తెలంగాణలో ఉందని, దీన్ని సరిదిద్దాలని తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహా రెడ్డి కోరారు. మరోవైపు, ఈ సమావేశానికి హాజరైన తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డికి చంద్రబాబు జ్ఞాపిక అందజేశారు.