దసరా నుంచి ఏపీ-తెలంగాణ ఆర్టీసీ బస్సులు - రెండు, మూడు రోజుల్లో చర్చలు ఫైనల్..
ఏపీ-తెలంగాణ విభజన తెచ్చిన లక్షా తొంభై సమస్యల్లో ఆర్టీసీ కూడా ఒకటి. ఉమ్మడి రాష్ట్రంలోనే నష్టాల్లో నడిచిన ఆర్టీసీని విభజన సందర్భంగా రెండు సంస్ధలుగా విడగొట్టడంలో ప్రభుత్వాలు చొరవ చూపకపోవడంతో వాటి ప్రభావం ఇప్పటికీ కనిపిస్తోంది. ముఖ్యంగా ఇరు రాష్ట్రాల ఆర్టీసీల మధ్య పూర్తిస్ధాయి ఒప్పందం లేకుండానే ఆరేళ్లుగా బస్సులు తిరుగుతుండటంతో ఏదో ఒక రోజు సమస్య తెరపైకి వస్తుందని అధికారులు భావించారు. చివరకు అదే నిజమైంది. కరోనా పేరుతో బస్సులు తిప్పడం మానేసిన తర్వాత కేంద్రం అన్లాక్ ప్రక్రియ ప్రకటించడంతో తిరిగి సాధారణంగా బస్సులు తిరుగుతాయని అంతా భావించారు. కానీ టీఎస్ఆర్టీసీ కొర్రీలు మొదలుపెట్టింది. దీంతో ఇప్పుడు ఆ కొర్రీలన్నింటినీ అంగీకరించి ఒప్పందం చేసుకునేందుకు ఏపీఎస్ఆర్టీసీ సిద్దమవుతోంది.
నాలుగోసారి కొలిక్కిరాని ఏపీ, తెలంగాణా ఆర్టీసీ చర్చలు.. దసరాకి బస్సుల కోసం ప్రజల ఎదురుచూపులు
కిలోమీటర్లపై ఆర్టీసీల పట్టుతో ప్రతిష్టంభన
రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాలు అంతకు ముందు ఎంత దూరం బస్సులు తిరిగాయో అంతే దూరాన్ని ఆరేళ్లుగా కొనసాగిస్తూ వచ్చాయి. దీని వల్ల తాము నష్టపోతున్నామని ఆలస్యంగా గుర్తించిన టీఎస్ఆర్టీసీ.. మేం మీ రాష్ట్రంలో ఎంత దూరం బస్సులు తిప్పుతామో మీరు కూడా మా రాష్ట్రంలో అంతే దూరం తిప్పాలని పట్టుబట్టింది. దీని ప్రకారం చూస్తే ఏపీఎస్ఆర్టీసీ ప్రస్తుతం ఏడాదికి తిరుగుతున్న దూరంలో లక్ష కిలోమీటర్లు తగ్గించుకుని కేవలం లక్షా 60 వేల కిలోమీటర్ల దూరానికే పరిమితం కావాల్సి ఆ విధంగా చేస్తే తాము నష్టపోతామని తొలుత మొరాయించిన ఏపీఎస్ ఆర్టీసీ.. టీఎస్ఆర్టీసీ పట్టుతో తాజాగా మెత్తపడినట్లు కనిపిస్తోంది. కిలోమీటర్లపై ఇరు ఆర్టీసీలు వెనక్కి తగ్గకపోవడంతో పలుమార్లు అధికారుల స్ధాయిలో జరిగిన ఆర్టీసీ చర్చలు విఫలమయ్యాయి.
. కిలోమీటర్లపై తగ్గిన ఏపీఎస్ఆర్టీసీ..
తెలంగాణ ఆర్టీసీ కోరుతున్న విధంగా పొరుగు రాష్ట్రంలో లక్షా 60 వేల కిలోమీటర్ల దూరంలోనే తమ బస్సుల రాకపోకలు ఉండేలాఏపీఎస్ఆర్టీసీ తాజాగా అంగీకరించింది. ఆదాయం నష్టపోతున్నా ఎంతకీ ప్రతిష్టంభన వీడకపోవడంతో కిలోమీటర్లపై వెనక్కి తగ్గుతామనే ప్రతిపాదనను టీఎస్ఆర్టీసీకి పంపింది. ఇప్పటికే అధికారుల స్ధాయిలో పలుమార్లు చర్చలు జరిగినా ఈ వ్యవహారంపై ఎంతకీ తెగకపోవడంతో మంత్రుల స్ధాయి చర్చలు జరిగితే తుది నిర్ణయం రావొచ్చని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు చెబుతున్నారు. అయితే ఇరు రాష్ట్రాల ఆర్టీసీలు నష్టపోకుండా ఇరువురూ పొరుగు రాష్ట్రాల్లో తిరిగే దూరాన్ని లక్షా 60 వేల కిలోమీటర్ల నుంచి రెండున్నర కిలోమీటర్లకు పెంచుకుందామని ప్రతిపాదిస్తున్నారు. దీన్ని ప్రస్తుతానికి టీఎస్ఆర్టీసీ అంగీకరించడం లేదు.
హైదరాబాద్ రూటుపైనే ఏపీ, తెలంగాణ పంతం...
ఏపీ, తెలంగాణ ఆర్టీసీలకు మిగతా రూట్ల పరిస్ధితి ఎలా ఉన్నా హైదరాబాద్ రూట్ మాత్రం చాలా కీలకం. ఏపీ, తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్కే ఎక్కువగా రాకపోకలు ఉంటాయి. మిగతా ప్రాంతాలకూ, రూట్లకూ రాకపోకలు ఈ స్ధాయిలో ఏ సీజన్లోనూ ఉండవు. దీంతో హైదరాబాద్ రూట్పైనే ఇరు రాష్ట్రాలు పట్టుబట్టాయి. ప్రస్తుతం ఇరు ఆర్టీసీలు పొరుగు రాష్ట్రాల్లో లక్షా 60 వేల కిలోమీటర్ల దూరంలోనే బస్సులు తిప్పాలని అంగీకారానికి వచ్చినా ఇందులో అత్యధిక భాగం హైదరాబాద్ రూట్లోనే ఉంటుంది. దీంతో ఈ రూట్లో ఎక్కువ బస్సులు ఏపీఎస్ఆర్టీసి తిప్పేందుకు టీఎస్ఆర్టీసీ అంగీకరిస్తుందా లేదా అనేది రాబోయే చర్చల్లో తేలనుంది.
Recommended Video
దసరా నుంచి ఆర్టీసీ సర్వీసులు..?
కరోనా తర్వాత ఏపీ-తెలంగాణ మధ్య నిలిచిపోయిన ఆర్టీసీ బస్సుల రాకపోకలను ఈ దసరా సీజన్ నుంచి ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కిలోమీటర్ల విషయంలో తెలంగాణ ప్రతిపాదనలకు ఏపీ అంగీకరించిన నేపథ్యంలో మిగిలిన అంశాలపై టీఎస్ఆర్టీసీ సడలింపు ఇస్తుందని భావిస్తున్నారు. దీంతో కీలకమైన దసరా సీజన్ను దృష్టిలో ఉంచుకుని ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పండుగ సీజన్లో ఇరు రాష్ట్రాల ఆర్టీసీ బస్సులు వాటి స్ధానంలో ప్రైవేటు బస్సులు రంగంలోకి దిగి ఇరువురి ఆదాయం కొల్లగొట్టడమే కాకుండా, ప్రయాణికులపై భారీ ఛార్జీలతో విరుచుకుపడటం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే అంతిమంగా ప్రయాణికుల ప్రయోజనాల దృష్ట్యా ఆర్టీసీ బస్సుల రాకపోకలు ప్రారంభమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.