కేసీఆర్! ఆ నీచభాష మనవళ్లకి చెప్పండి, బాబుపై అంతమాటా: సోమిరెడ్డి, 'రేపు ప్రజల్నీ తిడతారేమో'
అమరావతి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన ఆంధ్రప్రదేశ్ టీడీపీ నేత, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బుధవారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. తమ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు.
ఆంధ్రావాళ్లూ! తెలంగాణవాళ్లమని చెప్పుకోండి, మీకు చంద్రబాబే శని, సిగ్గు బుద్ధి రాలేదు: కేసీఆర్
ఓ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కేసీఆర్ హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు. కానీ ఆయన వాడిన భాష నీచంగా ఉందని, అలాంటి నీచమైన భాష ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ముందస్తు ఎన్నికలకు వెళ్లిన వారు ఎవరు కూడా విజయం సాధించలేదని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ, లెఫ్ట్, కోదండరాం పార్టీలతో కూడిన మహాకూటమిని చూసి టీఆర్ఎస్కు, కాంగ్రెస్కు భయం పట్టుకుందన్నారు.
అదే భాషను మీ మనవళ్లకు చెప్పగలరా?
మహాకూటమి భయంతో, ఆందోళనతోనే కేసీఆర్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని సోమిరెడ్డి అన్నారు. కేసీఆర్ అలా నోరు పారేసుకోవడం ఎందుకో చెప్పాలని నిలదీశారు. చంద్రబాబుపై కేసీఆర్ తాను ఉపయోగించిన భాషను ఆయన కుటుంబంలోని మనవళ్లకు చెప్పగలరా, వాళ్లు ఒప్పుకుంటారేమో చూడండి అన్నారు.
ఓ స్థాయికి వెళ్లాక పదిమంది చెప్పుకునేలా ఉండాలి
ఓ ముఖ్యమంత్రిపై మరో ముఖ్యమంత్రి ఉపయోగించిన భాష దురదృష్టకరమని సోమిరెడ్డి అన్నారు. అయినా కేసీఆర్ గురించి ఎక్కువగా మాట్లాడటం అనవసరమని చెప్పారు. ఓ స్థాయికి వెళ్లిన తర్వాత మన గురించి పదిమంది చెప్పుకునేలా ఉండాలని తెలంగాణ సీఎంకు ఆయన హితవు పలికారు.
ఇలాంటి మాటలతో మేధావితనం పోగొట్టుకుంటున్నారు
కేసీఆర్ ఇంతలా దిగజారి ప్రవర్తిస్తారని అనుకోలేదని సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ మేధావి అనే అభిప్రాయం ఉండేదని, కానీ ఇలాంటి మాటలతో ఆయన తన దిగజారుడుతనాన్ని నిరూపించుకుంటున్నారని, మేధావి అనే అభిప్రాయం పోయేలా మాట్లాడుతున్నారని చెప్పారు. కేసీఆర్ తన వ్యాఖ్యలతో ప్రజల్లో చులకన అయిపోతున్నారన్నారు.
Recommended Video
మతితప్పిన కేసీఆర్ను తప్పించి టీఆర్ఎస్ను కాపాడుకోండి
చంద్రబాబుపై కేసీఆర్ చేసిన విమర్శలపై తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణతో పాటు రావుల చంద్రశేఖర రెడ్డి తదితర టీడీపీ నేతలు కూడా మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలన అసలు రంగును తెలంగాణ సమాజం అర్థం చేసుకుందని ఇది గమనించిన కేసీఆర్ మతితప్పి మాట్లాడుతున్నారని, కేసీఆర్ను తొలగించి టీఆర్ఎస్ను కాపాడుకోవాలని ఆ పార్టీ శ్రేణులకు సూచించారు. నిర్లక్ష్య పాలన వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయో అన్నది కేసీఆర్ పాలనలో ప్రజలు చవిచూశారని, ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రజలు నిలదీస్తున్నారని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో టిట్లీ తుపాను వస్తే పలాసలో చంద్రబాబు నాలుగు రోజులు ఉండి ప్రజలకు సేవ చేశారని, కొండగట్టు బస్సు ప్రమాదంలో 63 మంది చనిపోతే ఆ కుటుంబాలను పరామర్శించకుండా కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికే పరిమితమయ్యారని టీడీపీ నేతలు దుయ్యబట్టారు.
రేపు ప్రజలను కూడా కేసీఆర్ తిడతారేమో
2009 ఎన్నికల్లో కేసీఆర్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారని, చంద్రబాబును పొగిడారని టీడీపీ నేతలు గుర్తు చేశారు. నాడు ఎన్నికల ప్రచారంలో స్వయంగా కేసీఆర్ మాట్లాడుతూ... రూ.10 వేల కోట్లతో గొర్రె తోక బెత్తెడులాగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను రూ.60 వేల కోట్లకు పెంచిన పరిపాలనాదక్షులు చంద్రబాబు అని పొగిడి, ఇప్పుడు తిట్టడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. అందరినీ తిట్టే కేసీఆర్ రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతే ప్రజలను కూడా తిడతారేమో అనే అనుమానం కలుగుతోందన్నారు. ముందస్తుకు ఎందుకు వెళ్లారో సరైన కారణం చెప్పడం లేదన్నారు.