ఏపీ, తెలంగాణా జలజగడం ... అపెక్స్ కౌన్సిల్ భేటీకి మరోమారు ముహూర్తం.. ఈ సారైనా ...
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులు, నీటి వినియోగంపై ఇప్పటివరకూ రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం కేంద్రం మరో ప్రయత్నం చేస్తోంది. వచ్చే నెల ఆరో తేదీ అపెక్స్ కమిటీ భేటీ ఏర్పాటు చేస్తున్నట్లుగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు సమాచారం అందించింది .ఈ మేరకు కేంద్ర జల శక్తి శాఖ లేఖలు ఇరు రాష్ట్రాలకు వెళ్ళాయి.
కృష్ణా బోర్డు ఆదేశాలు బేఖాతరు .. ఏ లెక్కా చెప్పని ఏపీ, తెలంగాణా .. తీవ్ర అసహనంలో బోర్డు
రెండు సార్లు వాయిదా పడిన అపెక్స్ కౌన్సిల్ భేటీ
కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన అపెక్స్ కౌన్సిల్ భేటీ జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీ ,తెలంగాణ సీఎం లు ఈ భేటీకి హాజరుకావలసి ఉంది. ఇప్పటికి రెండుసార్లు అపెక్స్ కౌన్సిల్ భేటీ వాయిదా పడింది. మొదటిసారి ఆగస్టు 5వ తేదీన సమావేశం జరగాల్సి ఉండగా సీఎం కేసీఆర్ సమావేశాన్ని వాయిదా వేయాలని కోరారు. ఆ తర్వాత మరో మారు సమావేశం నిర్వహించాలని భావించగా, కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో మరోమారు అపెక్స్ కౌన్సిల్ భేటీ వాయిదా పడింది.
అక్టోబర్ 6 వ తేదీన అపెక్స్ కమిటీ భేటీ ఏర్పాటు
ఇప్పుడు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కరోనా మహమ్మారి నుండి కోల్పోవడంతో తిరిగి సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో అక్టోబర్ 6 వ తేదీన అపెక్స్ కమిటీ భేటీ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం నుండి ఇరు రాష్ట్రాలకు సమాచారం అందించారు. మరి ఈసారైనా సమావేశం జరుగుతుందా, లేదా అన్నది తెలియాల్సి ఉంది.అయితే ఇప్పటికే ఇరు రాష్ట్రాలు నీటి కేటాయింపుల విషయంలో, కృష్ణా జలాల విషయంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
రెండు రాష్ట్రాల మధ్య జలజగడాలు .. రాయలసీమ ఎత్తిపోతలతో మళ్ళీ మొదలు
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందని కేసీఆర్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఇక రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుతో మొదలైన రగడ,ఇరు రాష్ట్రాల్లోనూ అన్ని ప్రాజెక్టులపై కృష్ణా బోర్డు నివేదికలు కోరే వరకు వెళ్ళింది. ప్రతి ఏడాది కేటాయించిన నీటి వాటా వినియోగంపై కూడా రెండు రాష్ట్రాల మధ్య రభస కొనసాగింది. ఇప్పటివరకు రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఏ జల వివాదానికి పరిష్కారం లేదు.
వివాదాలను పరిష్కరించటానికి రంగంలోకి దిగిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడమే కాకుండా, సుప్రీం కోర్టు మెట్లు కూడా ఎక్కారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు . దీంతో జల వివాదాలను పరిష్కరించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం నేరుగా జలశక్తి శాఖ మంత్రిని రంగంలోకి దింపి రెండు రాష్ట్రాల జల వివాదాలను పరిష్కరించాలని సూచించింది. ఈ క్రమంలోనే అపెక్స్ కమిటీ భేటీ నిర్వహించాలని కేంద్రం రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. అక్టోబర్ 6వ తేదీన భేటీ నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆ లేఖలో పేర్కొంది. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ భేటీకి హాజరవుతారా? సహకరిస్తారా ? అనేది తేలాల్సి ఉంది .