పోరాటంలో తెలుగోళ్ల పంథానే వేరు.... మొత్తానికి మన స్టైలేంటో చూపిస్తున్నారు
Recommended Video
అమరావతి: ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ ఏప్రిల్ 2 వ తారీఖు!..కారణం ఆరోజు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీలో అడుగుపెడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్న ఈ ఇద్దరు చంద్రుళ్లు ఒకే సమయంలో హస్తినలో అడుగుపెట్టనుండటం...అదీ పొలిటికల్ హీట్ అన్ని ఉష్ణోగ్రతా మాపకాలను బద్దలు కొట్టి పైకి దూసుకుపోతున్న సమయంలో ఈ ఢిల్లీ టూర్ పెట్టుకోవడం...మరి హాట్...హీట్ టాపిక్ కాకుండా ఉంటుందా?...
మరైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తెలంగాణా సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒకేసారి ఎందుకు ఢిల్లీ వెళుతున్నారు...అయితే ఇటీవలి కాలంలో ఈ ఇద్దరు సిఎంలు చెబుతున్న మాటలు...చేస్తున్న వ్యాఖ్యలను బట్టి వీరిద్దరి అంతిమ లక్ష్యం ఒకటేనని తెలుస్తోంది. అదేమిటంటే...కేంద్రంలో అధికారంలో ఉన్న కూటమి వ్యతిరేక శక్తులను ఏకతాటిమీదకు తీసుకు రావడం..అయితే ఇక్కడే మన తెలుగోళ్లకే ఉండే ప్రత్యేకమైన గుణం ఒకటి బైటపడుతోంది.
ఇద్దరి చంద్రుల లక్ష్యాలు...ఏంటంటే?...
ఇద్దరు చంద్రుల హస్తిన ప్రయాణానికి కారణాలు...తెలంగాణా సిఎం కెసిఆర్ ఏమో ప్రస్తుతమున్న కూటమిని...మరో పాత కూటమిని తోసిరాజని ఒక కొత్త కూటమిని..అనగా థర్డ్ ప్రంట్ ను కూడగట్టే పని పెట్టుకోని ఢిల్లీ వెళుతున్నరని టాక్...ఇక ఎపి సిఎం చంద్రబాబేమో ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం...నిన్నటి తమ మిత్రపక్షం ఎన్డియే కూటమిని వ్యతిరేకించే వారందరినీ కూడగట్టడం...ఒకరి టార్గెట్ ప్రజంట్...మరొకరి టార్గెట్ ఫ్యూచర్...సరే అంతిమంగా వీరి ఉమ్మడి శత్రువు కేంద్రంలోని ఎన్డిఏ కూటమిగా చెప్పుకోవచ్చు.
తెలుగోళ్ల సత్తా చూపేందుకు...సిద్దం
సో...ఒక తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వాన్నికుప్పకూలిస్తే...మరో స్టేట్ సిఎం ఆ తరువాత గద్దెనెవరు ఎక్కాలో డిసైడ్ చేస్తారు...సూపర్ గా ఉంది కదా! ఎందుకంటే...భారతదేశ దశ దిశలనే మన తెలుగువాళ్లు శాసించనుండటం మనందరికి ఎంత గర్వకారణం...అయితే అంతే బాగానే ఉంది కాని సామాన్యులకు అర్ధం కాని విషయం ఒక్కటే...వీరిద్దరి మిషన్ ఒకటే అయినప్పుడు కలసి ఎందుకు పోరాటం చేయడం లేదా అని!
విడివిడిగా ఎందుకు?...వ్యూహమా?
మరైతే లక్ష్యంగా ఒకటే అయినప్పుడూ ఏకమై పోరాడటం మంచిది కదా?...ఐకమత్యమే మహాబలం అని అందరికీ తెలిసిన విషయమే కదా...విడివిడిగా పోరాడటమేంటీ...ఓహో వ్యూహమా?...అదయితే ఫరవాలేదు...కాని తెలుగువాళ్ల సహజ లక్షణం లాగా నేను ఎదగపోయినా ఫరవాలేదు...పక్కవాడు ఎదగకుండా ఉంటే చాలు అనే ఆ గొప్ప గుణం అందులో లేకుంటే చాలు...ఎందుకంటే...సామాన్యులకు అందరికీ కేంద్రంపై వీరిద్దరూ కలసి ఎందుకు పోరాటం చేయడం లేదా అనే సందేహమే వస్తోంది.
ఎందుకంటే...ఎపిలో కూడా అదే...
తెలుగోళ్ల లక్షణం అదే అనడానికి తాజా రుజువు మరొకటి ఏంటంటే...ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయమే తీసుకుంటే తెలుగోళ్లకు ఉన్న ఈ ప్రత్యేక లక్షణాన్ని తేటతెల్లం చేస్తోంది. ఎపికి స్పెషల్ స్టేటస్ కోసమే ఆంధ్రాలో ప్రధాన రాజకీయ పార్టీలైన టిడిపి, వైసిపి పోరాడుతున్నాయి. వీరిద్దరూ పోరాడుతోంది ఒకే అంశం మీద..ఇప్పుడు ఇద్దరి ఉమ్మడి శత్రువు కేంద్రమే..కానయితే వీళ్లిద్దరూ కలసి మాత్రం పోరాటం చేయరు...అదేమంటే ఇక్కడ కూడా రాజకీయ ప్రయోజనాలే పరమావధి...క్రెడిట్ దక్కితే నాకే దక్కాలి...లేకుంటే ఇంకెవరికీ దక్కకూడదు...ఎదుటిపక్షానికి అసలు దక్కకూడదు...అంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి...అయితే అది నా ద్వారా రావాలి...అతని ద్వారా వచ్చేట్లయితే అసలు రాకపోయినా పర్లేదు...ఆ తరువాత రాష్ట్రం ఏమైనా పర్లేదు...ఇదీ మన తెలుగునేతల తీరు...
తెలుగునేతలనే...ఎందుకంటే...
రాష్ట్ర ప్రయోజనాల విషయం వచ్చినపుడు...కేంద్రపై పోరాటం చేయాల్సివచ్చినపుడు...మిగతా అన్ని రాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా పోరాటం చేయడం కద్దు...గతంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినపుడు పొరుగు రాష్ట్రం తమిళనాడుకు సంబంధించి బద్ద విరోధులైన అన్నాడిఎంకే, డిఎంకే లు కలసి ఏకతాటిమీద కేంద్రం మెడలు వచ్చిన సందర్భాలు చూశాం...కానీ తెలుగువాళ్లు మాత్రం అంతకు పూర్తి విరుద్దంగా రాష్ట్ర ప్రయోజనాల కన్నా...తమ రాజకీయాల ప్రయోజనాలే పరమావధిగా పావులు కదపడం మన ప్రత్యేక లక్షణంగానే చెప్పుకోకతప్పదు.
అవిశ్వాస తీర్మానం లోనూ...అంతే
ఎపికి ప్రత్యేక హోదా విషయంలోనూ తెలుగు వాళ్లు తమ ప్రత్యేకత చాటుకుంటున్నారు...ఏదో ఒక అంశాన్ని ఆధారంగా చేసుకొని ఏకమై పోరాడాల్సింది పోయి...విడివిడిగా పోరాడుతూ నవ్వులపాలవుతున్నారు...అవిశ్వాస తీర్మనం విషయమే తీసుకుంటే కేంద్రానికి వ్యతిరేకంగా మద్దతును కూడగట్టే విషయంలో వేరే రాష్ట్రాలకు చెందిన పార్టీ వద్దకు వెళ్లినప్పుడు వారు ఇదే ప్రశ్న వేస్తే ఏమి సమాధానం చెబుతారో...చెబుతున్నారో ఊహించడానికి కూడా వీలు కాని పరిస్థితి. కారణం... వీరు వారికి ఏ రకంగా బదులిచ్చినా స్థూలంగా అది తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసే విధంగానే ఉంటుందనడంలో సందేహం లేదు. మీ రాష్ట్రం కోసం మీరు కలసిరాకుండా మమ్మల్ని కలసి రమ్మని ఎలా అడుగుతున్నారని వారడిగితే వీరు ఏం సమాధానం చెబుతారో...చెబుతున్నారో ఊహించగలరా... మరోవైపు టిఆర్ఎస్ కూడా తోటి తెలుగు రాష్ట్రంగా ఎపికి ప్రత్యేక హోదాకు మద్దతు అంటూనే...అదే అంశం ఆధారంగా పెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా అడ్డకుంటున్న పరిస్థితి...అందుకే ఇంకా అందరిముందు నవ్వులపాలు కాకముందే...ఇకనైనా తెలుగువాళ్లు మేల్కొని ఏకమై పోరాటం చేసి తమ సత్తా చాటాలని కోరుకుందాం...