ఏపీలో విగ్రహాల రాజకీయం- చంద్రబాబు హిందుత్వ కార్డు- జాతీయ మీడియాలో చర్చ
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కూడా పూర్తికాకముందే రాజకీయాలు వేడెక్కాయి. త్వరలో జరిగే తిరుపతి ఉపఎన్నికతో పాటు స్ధానిక సంస్దల ఎన్నికలు, ఏడాదిలో జరుగుతాయని భావిస్తున్న జమిలి ఎన్నికలతో ఇక్కడ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకున్న విగ్రహాల విధ్వంసం ఘటనలతో పార్టీలు తమ అసలు రూపాల్ని బయటపెడుతున్నాయి. అధికార వైసీపీపై బురదజల్లే క్రమంలో ఇప్పటికే తాము మెజారిటీ హిందువులకు అనుకూలమంటూ బీజేపీ, ఆ పార్టీ మిత్రపక్షం జనసేన ప్రకటనలు చేస్తుండగా.. ఇన్నాళ్లుగా లౌకిక పార్టీగా చెప్పుకుంటున్న టీడీపీ హిందూత్వ కార్డుకు మళ్లుతోంది.
విగ్రహాల విధ్వంసంతో రాజకీయ రచ్చ
ఏపీలో వరుసగా చోటు చేసుకుంటున్న విగ్రహాల విధ్వంసాన్ని అరికట్టడంలో వైసీపీ ప్రభుత్వ అలసత్వం, వైఫల్యం ఇప్పుడు విపక్షాలకు వరంగా మారిపోతోంది. ముఖ్యంగా ఏడాదిన్నరగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు పలు అస్త్రాలు సంధించిన పార్టీలు వాటి ద్వారా తగిన మైలేజ్ పొందడంలో మాత్రం విఫలమయ్యాయి. దీంతో ఇప్పుడు విగ్రహాల విధ్వంసం వారికి భారీగా కలిసివస్తోంది. విథ్వంసంలో ఎవరి పాత్ర ఉందో తేల్చడంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు విపక్షాలకు రాజకీయంగా మంచి అవకాశం కల్పించింది. దీంతో విగ్రహాల అంశాన్ని సామాన్యుల వద్దకు కూడా తీసుకెళ్లి రాజకీయం చేసేందుకు వారికి ఛాన్స్ దొరికింది.
బీజేపీ, జనసేనకు భారీ మైలేజ్
ఏపీలో విగ్రహాల విధ్వంసం ఘటనలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేకపోయినా వాటిని అదుపు చేయడంలో మాత్రం సర్కారు వైఫల్యంపైనే ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ సాగుతోంది. దీంతో ప్రభుత్వం ప్రజల ముందు దోషిగా నిలబడాల్సిన పరిస్ధితి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన ఇన్ని ఘటనల తర్వాత స్పందించిన ప్రభుత్వం పోలీసుల సాయంతో దోషుల వివరాలు ఒక్కొక్కటిగా బయటపెడుతోంది. ఇదే క్రమంలో రాష్ట్రంలో మతసామరస్యం నెలకొల్పేందుకు కమిటీలు వేస్తోంది. అయినా ఇప్పటికే విగ్రహాల విధ్వంసాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లడంలో బీజేపీ, జనసేన పార్టీలు విజయవంతమయ్యాయి. దీనికి మరో కారణం ఇది వారిద్దరి అజెండా మాత్రమే కాదు ప్రధాన విపక్షం బీజేపీ అజెండా కూడా కావడమే.
చంద్రబాబు హిందుత్వ కార్డు ప్రయోగం
దైవభక్తి ఉండటం వేరు అదే అజెండాతో రాజకీయాలు చేయడం వేరు. ఇందులో బీజేపీ ఎప్పుడూ ఎదుర్కొనే విమర్శ హిందూత్వ అజెండాయే. ఈ దేశంలో బీజేపీతో పాటు మిగతా పార్టీల్లోనూ మెజారిటీ హిందువులు ఉన్నా హిందూత్వ అజెండాతో ముందుకెళ్లిన బీజేపీ సహజంగానే మెజారిటీ హిందువుల మద్దతు సాధించుకుంటోంది. ఇప్పుడు ఇదే అజెండాను ఏపీలో తాము కూడా అమలు చేస్తే ఎలా ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా భావిస్తున్నారా అంటే అవుననే సమాధానం జాతీయ మీడియాలో వినిపిస్తోంది. ముఖ్యంగా విగ్రహాల విధ్వంసం తర్వాత చంద్రబాబు చేస్తున్న విమర్శలు, మతాల పేరుతో సీఎం, హోంమంత్రి, డీజీపీని టార్గెట్ చేసిన తీరు ఆయన ప్రత్యర్ధులకే కాదు సొంత పార్టీ నేతలకు కూడా నచ్చని పరిస్దితి. అయినా చంద్రబాబు హిందూత్వ కార్డును బలంగా ప్రయోగించేందుకే సిద్ధమైపోయినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
బీజేపీ అజెండాతో మైలేజ్ వెతుక్కుంటున్న చంద్రబాబు
ఒకప్పుడు ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు చేయలేదంటూ కేంద్రంలో ఎన్డీయే సర్కారుకు గుడ్బై చెప్పి ఎన్నికల్లో ధర్మపోరాటం పేరుతో బీజేపీకి వ్యతిరేకంగా 21 పార్టీలను కూడగట్టిన చరిత్ర చంద్రబాబుది. కానీ ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత ఏడాదిన్నరగా బీజేపీకి దగ్గరయ్యేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. కానీ కాలం కలిసి రాలేదు. తమపై పోరాటం చేసినా ఫర్వాలేదు కానీ తమకు వ్యతిరేకంగా ఓ కూటమినే తయారు చేసిన చంద్రబాబును మరోసారి నమ్మేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. దీంతో బీజేపీని మెప్పించేందుకు ఈసారి వారి అజెండా అయిన హిందూత్వనే చంద్రబాబు నమ్ముకుంటున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చంద్రబాబుపై జాతీయ మీడియాలో చర్చ
విగ్రహాల విధ్వంసం ఘటనల నేపథ్యంలో హిందూత్వ అజెండాతో చంద్రబాబు దూకుడుగా ముందుకెళ్తున్న తీరుపై జాతీయ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సీఎం జగన్, ఆయన మంత్రులు, అధికారులు క్రైస్తవాన్ని ప్రోత్సహిస్తున్న తీరుపై చంద్రబాబు చేస్తున్న విమర్శలను జాతీయ మీడియా నిశితంగా పరిశీలిస్తోంది. పాస్టర్లకు నెలకు ఐదువేల సాయం ఇవ్వడం, పోలీసు స్టేషన్లలో క్రిస్టమస్ వేడుకలు నిర్వహించడం, తిరుమల కొండపై జగన్ కేబినెట్లో డిప్యూటీ సీఎం క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడం వంటి పరిణామాలపై చంద్రబాబు వ్యాఖ్యలను జాతీయ మీడియా హైలెట్ చేస్తోంది. దీంతో చంద్రబాబుకు ఈ విషయంలో ఊహించని మైలేజ్ దక్కుతున్నట్లు అర్ధమవుతోంది.