టెట్ గందరగోళం...మరోసారి మారనున్న షెడ్యూల్?...ముచ్చటగా మూడోసారి...
అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ను మొదటి నుంచీ గందరగోళం వెంటాడుతోంది. ముందస్తు ప్రణాళికలు లేకుండా పాఠశాల విద్యాశాఖ టెట్ షెడ్యూల్ హడావిడిగా ప్రకటించి అభ్యర్థుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే రెండు సార్లు టెట్ షెడ్యూల్ను మార్చిన విద్యాశాఖ ముచ్చటగా మూడోసారి మార్చనుంది.
ప్రతి ఏటా నిర్వహించాల్సిన టెట్ను రాష్ట్రప్రభుత్వం మూడేళ్ల నుంచి నిర్వహించడం లేదు. టెట్, ఉపాధ్యాయ ఖాళీలపై ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసింది. కోర్టు ఆదేశాలతో రాష్ట్రంలో 12,307 ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు డిసెంబర్ 6న ప్రకటించారు. అదే రోజు టెట్ నిర్వహిస్తామని వెల్లడించి, షెడ్యూల్ను డిసెంబర్ 13న ప్రకటించారు. డిసెంబర్ 14న నోటిఫికేషన్తో పాటు సిలబస్, అర్హతలను విడుదల చేశారు. జనవరి 17 నుంచి 27 వరకు నిర్వహిస్తామని వెల్లడించారు.
అయితే టెట్ కు నెల రోజుల్లో సిద్ధం కాలేమని, కొంత సమయం కావాలని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించడంతో ఫిబ్రవరి 5 నుంచి 15 వరకు వాయిదా వేసింది. తమకు కూడా టెట్కు అవకాశం కల్పించాలని డిఎడ్, బిఎడ్ చివరి సంవత్సరం విద్యార్థులు, బిటెక్ డిగ్రీతో బిఎడ్ చేసిన అభ్యర్థులు కోరారు. భాషకు మార్కులు పెంచాలని భాషా పండితులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ అభ్యర్థల్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం వారికి అవకాశం కల్పిస్తూ ఈ నెల 12న ఉత్తర్వులు జారీచేసింది. టెట్ అభ్యర్థుల మార్కుల శాతం కూడా తగ్గించింది. అప్పటి వరకు రెండు పేపర్లలో ఉంటుందని చెప్పిన ప్రభుత్వం భాషా పండితుల కోసం పేపర్-3ను ప్రవేశపెట్టింది. పేపర్-3 సిలబస్ ఈ నెల 17న పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ సిలబస్ ఎక్కువగా ఉందని, తక్కువ సమయంలో ఎలా సిద్ధం కావాలని భాషా పండితులు ఆందోళన వ్యక్తం చేశారు. సమయం పెంచాలని ఆందోళన బాట పట్టారు.
వీరికి తోడు కొత్తగా అవకాశం వచ్చిన అభ్యర్థులు కూడా సమయం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 23న టెట్ అభ్యర్థులు విద్యాశాఖ మంత్రి గంటాశ్రీనివాసరావును కాకినాడలో అడ్డగించడంతో టెట్ షెడ్యూల్ పొడిగిస్తామని మంత్రి హామీనిచ్చారు. వాయిదాపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె సంధ్యారాణి గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముందుగా అనుకున్నట్లుగా ఫిబ్రవరి 5 నుంచి కాకుండా ఫిబ్రవరి 21 నుంచి మార్చి 3 వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే వాయిదా విషయాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం లేదా శనివారం ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు టెట్ కొరకు రాష్ట్రవ్యాప్తంగా 4,36,311 మంది దరఖాస్తు చేసుకున్నారు.