మండలి ఛైర్మన్ కు విచక్షణాధికారాల్లేవ్- రాజధాని బిల్లుల ఆమోదం సక్రమమే- అసెంబ్లీ కార్యదర్శి
ఏపీలో మూడు రాజధానుల బిల్లులకు ఆమోదం తెలిపే ప్రక్రియలో చోటు చేసుకున్న పరిణామాలు వాటి ఆమోదంపై ప్రభావం చూపబోవని అసెంబ్లీ కార్యదర్శి తాజాగా హైకోర్టుకు దాఖలు చేసిన ప్రమాణపత్రంలో తేల్చేశారు. రాజధానుల బిల్లుల ఆమోదం నేపథ్యంలో మండలిలో జరిగిన పరిణామాల ప్రభావం వాటి భవితవ్యాన్ని తేల్చలేదని ఆయన స్పష్టం చేశారు. చివరికి మండలి ఛైర్మన్ తన విచక్షణాధికారాలతో బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపలేరని, కేవలం సభకు మాత్రమే ఆ హక్కు ఉందని ఆయన తెలిపారు. రాజధాని బిల్లుల ఆమోదంపై టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ దాఖలు చేసిన పిల్పై అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు హైకోర్టులో ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేశారు.
మూడు రాజధానులపై హైకోర్టు మరో షాక్- అక్టోబర్ 5 వరకూ స్టేటస్కో- ఇక రోజువారీ విచారణ
బిల్లుల ఆమోదం రాజ్యాంగబద్ధమే...
ఏపీలో మూడు రాజధానులకు ఉద్దేశించిన రాజధాని వికేంద్రీరణ, సీఆర్డీయే చట్టం రద్దు బిల్లులను శాసనసభ రెండుసార్లు ఆమోదించగా.. మండలి ఓసారి సెలక్ట్ కమిటీకి పంపింది. మరోసారి చర్చకు కూడా తీసుకోకుండానే నిరాకరించింది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో అసలు బిల్లులు ఆమోదమే పొందలేదని ప్రకటించాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీని విచారణ సందర్భంగా ప్రతివాది అయిన శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు తన అఫిడవిట్ దాఖలు చేశారు. ఇందులో బిల్లుల ఆమోదం రాజ్యాంగ బద్ధంగానే జరిగిందని, సభ నియమాల ఆధారంగానే బిల్లులను ఆమోదించి పంపామని ఆయన గుర్తు చేశారు. బిల్లుల ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ నోటీసు ఇచ్చినా ఆమోదంపై దాని ప్రభావం ఉండబోదన్నారు.
మండలి ఛైర్మన్ విచక్షణాధికారం...
రాజధాని బిల్లులపై తొలిసారి చర్చ సందర్భంగా శాసన మండలి ఛైర్మన్ షరీఫ్ తనకున్న విచక్షణాధికారం మేరకు బిల్లులను సెలక్ట్ కమిటీ పరిశీలనకు పంపుతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత సెలక్ట్ కమిటీ ఏర్పాటు కానీ, మిగతా ప్రక్రియ కానీ జరగలేదు. దీంతో బిల్లులు నిర్ణీత గడువు తర్వాత ఆమోదం పొందినట్లేనని శాసనసభ కార్యదర్శి హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు. అసలు మండలి ఛైర్మన్కు విచక్షణాధికారం ఎక్కడుందని, కేవలం సభకు మాత్రమే బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపే అధికారం ఉందని పేర్కొన్నారు. తద్వారా మండలి ఛైర్మన్ చేసిన ప్రకటన చెల్లదని ఆయన అఫిడవిట్లో చెప్పినట్లయింది.
Recommended Video
గవర్నర్ ఆమోదం తర్వాత కోర్టుల జోక్యం..
చట్టాలు చేసే క్రమంలో కొన్ని విధానపరమైన లోపాలున్నా వాటిని ఓసారి గవర్నర్ లేదా రాష్ట్రపతి ఆమోదిస్తే ఇక వాటిని ఎవరూ ప్రశ్నించలేరని శాసనసభ కార్యదర్శి తన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఓసారి బిల్లులను చట్ట సభలు ఆమోదించి గవర్నర్కు పంపాక, ఆయన కూడా ఆమోదిస్తే అవి చట్టాలుగా మారిపోతాయని, అప్పుడు ఇక యస్ధానాల జోక్యం కూడా చెల్లదని ప్రస్తుతం రాజధాని బిల్లులు కూడా అలాగే గవర్నర్ ఆమోదం పొందినందున ఇక వాటిపై కోర్టులు జోక్యం చేసుకోలేవన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఎన్నో తీర్పులు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. సుప్రీంకోర్టు న్యాయస్ధానాల పరిధిని తన పాత తీర్పుల్లో స్పష్టంగా నిర్వచించిందని కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు తెలిపారు.