మళ్లీ గవర్నర్ చెంతకు రాజధాని బిల్లులు- ప్రభుత్వ పరిశీలన తర్వాత- ఆమోదంపై ఉత్కంఠ....
ఏపీలో మూడు రాజధానులకు ఉద్దేశించిన సీఆర్డీయే చట్టం రద్దు, వికేంద్రీకరణ బిల్లులు మరోసారి గవర్నర్ కోర్టులోకి వెళ్లాయి. ఇప్పటికే ప్రభుత్వం ఓసారి ఆయనకు పంపిన బిల్లులు న్యాయసమీక్ష కోసం ప్రభుత్వానికి వచ్చాయి. వీటిని పూర్తి చేసి గవర్నర్ కు మరోసారి వీటిని పంపారు. దీంతో ఇప్పుడు ఆయన కేంద్రం నుంచి న్యాయసలహా కోరతారా లేక యథాతథంగా ఆమోదిస్తారా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రభుత్వం మాత్రం బిల్లులను గవర్నర్ యథాతథంగా ఆమోదిస్తారని గంపెడాశతో ఉంది.
గవర్నర్ పరిశీలనలో రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లు, జనసేనాని పవన్ కల్యాణ్ కామెంట్స్
మరోసారి గవర్నర్ కు బిల్లులు..
ఏపీలో మూడు రాజధానుల బిల్లులు మరోసారి గవర్నర్ చెంతకు చేరాయి. గతంలో ఓసారి ప్రభుత్వం వీటిని గవర్నర్ వద్దకు ఆమోదానికి పంపింది. అయితే ఆయన ప్రభుత్వం పరిధిలోని న్యాయశాఖతో పాటు సీఎంవో నుంచి దీనిపై సమీక్ష కోరారు. గవర్నర్ కోరిన విధంగా న్యాయ అంశాల సమీక్ష పూర్తి చేసి ప్రభుత్వం మరోసారి వీటిని గవర్నర్ కు పంపింది. గత శనివారం గవర్నర్ వీటిని న్యాయసమీక్షకు పంపగా.. ప్రభుత్వం బుధవారం వీటిపై సమీక్ష పూర్తి చేసి రాజ్ భవన్ కు పంపింది. దీంతో గవర్నర్ దీనిపై ఈసారి కేంద్రం నుంచి సలహా తీసుకుంటారా లేక యథాతథంగా ఆమోదిస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది.
ఇప్పటికే రాష్ట్రపతి దృష్టికి...
ఏపీ మూడు రాజధానుల వ్యవహారం ఇప్పటికే రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లిన వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు.. ఆయనకు అప్పటికే వాటిపై క్లారిటీ ఉందని వెల్లడించారు. తద్వారా రాష్ట్రపతి దృష్టిలో ఈ అంశం ఉందనే సంకేతాలు ఇటు వైసీపీ ప్రభుత్వంతో పాటు గవర్నర్, కేంద్రానికీ స్పష్టం చేసినట్లయింది. దీంతో ఇప్పుడు రాష్ట్రపతి దృష్టిలో ఉన్న అంశంపై గవర్నర్ స్వేచ్ఛగా నిర్ణయం తీసుకుంటారా అన్న ఉత్కంఠ నెలకొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి న్యాయసలహా కోరినట్లుగానే కేంద్ర హోంశాఖ సలహా కూడా తీసుకుని తుది నిర్ణయం తీసుకోవచ్చనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే హోంశాఖను గవర్నర్ సంప్రదించారనే మరో ప్రచారం కూడా సాగుతోంది.
Recommended Video
కేంద్రం జోక్యం ఉంటుందా ?
ఇప్పుడు ఏపీలో విపక్ష పార్టీలంతా రాజధాని బిల్లుల విషయంలో కేంద్రం జోక్యం కోరుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా రాజధానులను ఏర్పాటు చేస్తోందని, ఇందులో కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే బీజేపీ తరఫున ఇప్పటికే జీవీఎల్ నరసింహారావుతో పాటు సునీల్ దియోధర్ వంటి వారు కేంద్రం అభిప్రాయాన్ని పలుమార్లు స్పష్టం చేశారు. కాబట్టి కేంద్రం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్న వాదన కూడా వినిపిస్తోంది. అంతిమంగా ఎవరెన్ని నిర్ణయాలు తీసుకున్నా న్యాయసమీక్షకు నిలబడాల్సి ఉంటుందన్న ఏకైక కారణంతో అన్ని జాగ్రత్తలు తీసుకునేందుకే గవర్నర్ కానీ, కేంద్రం కానీ ప్రయత్నించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.