ఏపీ రాజధాని బిల్లులపై అదే ఉత్కంఠ.. న్యాయకోవిదులతో గవర్నర్ సంప్రదింపులు..
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన పాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఉత్కంఠ కొనసాగుతున్నది. వీటిపై తుది నిర్ణయం తీసుకోవాల్సిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఏపీ సర్కారుకు కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగులుతోన్న నేపథ్యంలో దీనికి ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది.
వికేంద్రీకరణ బిల్లు.. ఏపీ పునర్విభజన చట్టం-2014తో ముడిపడి ఉన్నందున, దానిపై ఎలా ముందుకు వెళితే బాగుంటుందనే అంశంపై గవర్నర్ న్యాయసలహాలు తీసుకుంటున్నారు. గురువారం, శుక్రవారాల్లో పలువురు న్యాయకోవిదులు, సీనియర్ న్యాయవాదుల అభిప్రాయాలను రాజ్ భవన్ అధికారులు అడిగి తెలుసుకున్నట్లు వెల్లడైంది. సంప్రదింపుల అనంతరం రెండు రోజుల్లో బిల్లులపై గవర్నర్ తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
జగన్ సర్కారుకు భారీ షాక్.. నిమ్మగడ్డ కేసులో సుప్రీం తీవ్ర స్పందన.. 'ధిక్కరణ'పై స్టే కు నిరాకరణ..
పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు రెండోసారి అసెంబ్లీలో ఆమోదం పొంది, శాసన మండలికి వెళ్లగా, వాటినికి ప్రవేశపెట్టకముందే సభ నిరవదికంగా వాయిదా పడింది. మండలికి రెండో సారి కూడా బిల్లుల్ని పంపినందున, దాని ఆమోదంతో సంబంధం లేకుండానే ఆమోదం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తున్నది. అయితే, మండలి సెలెక్ట్ కమిటీకి వెళ్లాల్సిన బిల్లులపై ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని ప్రతిపక్షం వాదిస్తున్నది.
Recommended Video
రాజ్ భవన్ కు పంపిన బిల్లులు మరోసారి న్యాయశాఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎంవో పరిశీలన అనంతరం తిరిగి గవర్నర్ చెంతకే చేరాయి. ఈలోపే ఈ బిల్లులపై ప్రధానమంత్రి కార్యాలయం ఆరా తీయడంతో, తర్వాత ఏం జరగబోతోందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, రాష్ట ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పునర్నియామకం విషయంలో గవర్నర్,కోర్టుల ఆదేశాలను పట్టించుకోకపోవడంపై జగన్ సర్కారకు సుప్రీంకోర్టు తలంటింది. ప్రభుత్వంపై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్ పై స్టే ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.