రాజధానిపై ట్విస్ట్: అమరావతి ముహుర్తానికే విశాఖలో శంకుస్థాపన - మోదీ కోసం జగన్ గజయత్నం - అంతలోనే..
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులకు సంబంధించి ఆసక్తికర ట్విస్ట్ చోటుచేసుకుంది. విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేస్తారంటూ మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేసిన ప్రకటనలన్నీ లీగల్ చిక్కుల కారణంగా సవరణకు గురయ్యే పరిస్థితి నెలకొంది. అయితే, రాజధానులుపై మడమతిప్పేదే లేదంటోన్న అధికారవర్గం.. విశాఖలో శంకుస్థాపనను వాయిదా వేసి.. సరిగ్గా అమరావతి ముహుర్తానికే నిర్వహించాలని డిసైడ్ అయినట్లు, ప్రధాని మోదీని చీఫ్ గెస్టుగా ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
కొత్త జిల్లాలపై జగన్ సర్కారు ట్విస్ట్ - రాత్రికిరాత్రే జీవో సవరణ - సవాళ్లు - ఏపీలో కేసీఆర్ ఫార్ములా?
16న లేనట్లే..
రాష్ట్రంలో పాలన వికేంద్రీకరణ బిల్లులకు గత నెల 31న గవర్నర్ ఆమోదం తెలపగా, అదే రోజు మూడు రాజధానులు ఉనికిలోకి వచ్చాయంటూ జగన్ సర్కారు గెజిట్ నోటిషికేషన్ విడుదల చేసింది. అదే ఊపులో ఆగస్టు మొదటి వారంలోనే విశాఖలో కార్యనిర్వాహక రాజధానికి శంకుస్థాపన చేయాలని భావించింది. కానీ అమరావతి రైతులు తీవ్ర అభ్యంతరాలతో పిటిషన్లు వేయడంతో సదరు గెజిట్ నోట్ పై హైకోర్టు స్టే విధించి, ఈనెల 14 వరకు స్టేటస్ కో (అంతకుముందున్న యధాస్థితి) పాటించాలని ఆదేశించింది. ఈనెల 14న రాబోయే కోర్టు ఉత్తర్వులను బట్టి, స్వాతంత్ర్యదినోత్సవమైన ఆగస్టు 15న లేదా ఆగస్టు 16న సీఎం జగన్ విశాఖలో శంకుస్థాపన చేస్తారని అధికార వర్గాలు ప్రకటించాయి. కానీ, ఈవెంట్ కు ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించాలనుకుంటోన్న సీఎం జగన్.. ఈ సారి పక్కాగా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
కోర్టుల్లో సీన్ ఇది..
ఏపీ కొత్త కార్యనిర్వాహక రాజధానిని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించాలనుకుంటోన్న సీఎం జగన్.. అంతకంటే ముందు న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడాలని భావిస్తున్నారు. అమరావతి రైతులకు అన్ని విధాలుగా న్యాయం చేస్తామనే భరోసా ద్వారా ఈనెల 14న హైకోర్టు ఆదేశాలు తమకు అనుకూలంగా రావొచ్చని వైసీపీ వర్గాలు ఆశిస్తున్నాయి. హైకోర్టు స్టే ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఇంకా విచారణకు రాలేదు. రాజధాని మార్పునకు కేంద్రం సైతం అంగీకారం తెలిపిన నేపథ్యంలో కోర్టు చిక్కులన్నీ తొలగిపోతాయని సీఎం ఆశాభావంలో ఉన్నారు.
పిలిచి అన్నం పెడితే.. కెలికి కయ్యమా? - జగన్ పై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు - మోదీపైనా ఫైర్
అమరావతి ముహుర్తం.. అదే మోదీ..
లీగల్ క్లియరెన్స్ లు లభించిన తర్వాత.. ప్రధాని మోదీ చేతుల మీదుగా విశాఖలో రాజధానిని ప్రారంభించాలనుకుంటోన్న వైసీపీ సర్కారు.. అందుకు దసరా పండుగను ముహుర్తంగా ఎంచుకుంది. విచిత్రంగా.. ఐదేళ్లకిందట అమరావతికి శంకుస్థాపన జరిగింది కూడా విజయ దశమి ముహుర్తానే కావడం, చేసింది ప్రధాని మోదీనే కావడం గమనార్హం. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో విజయ దశమి ముహూర్తాన 2015, అక్టోబర్ 21న అమరావతిలో శంకుస్థాపన జరిగింది. నాటి వేడుకలో మోదీతోపాటు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొన్నారు. ఈ ఏడాది దసరా పండుగ అక్టోబర్ 25న ఉంది. విజయదశమి ముహుర్తానికే విశాఖలో, అది కూడా ప్రధానితో శంకుస్థాపన చేయించడం ద్వారా అన్ని విమర్శలకు చెక్ పెట్టొచ్చనుకుంటోన్న జగన్.. ఆమేరకు మోదీని ఒప్పించేందుకు గజప్రయత్నం చేస్తున్నట్లు వినికిడి. అందుకు పెద్దాయన సైతం సానుకూలత వ్యక్తం చేశారని, అప్పటికి కరోనా పరిస్థితులను బట్టి నేరుగా లేక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ హాజరయ్యే అవకాశాలున్నాయని వైసీపీ అనుబంధ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
రాజధానిపై బీజేపీ వేరు.. కేంద్రం వేరు..
విజయ దశమి నాడు విశాఖలో కార్యనిర్వాహక రాజధాని శంకుస్థాపనకు ప్రధాని మోదీ సానుకూలత వ్యక్తం చేశారనే ప్రచారం ఓవైపు ఉధృతంగా సాగుతుండగా.. మంగళవారం విజయవాడలో బీజేపీ నేతలు చేసిన ప్రకటనలను పార్టీ వేరు, కేంద్రం వేరనే సంకేతాలిచ్చింది. రాష్ట్రాల రాజధానుల విషయంలో కేంద్రం రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తుందని, అంతమాత్రాన ఒక పార్టీగా బీజేపీ ఇక్కడి అన్యాయాలను చూస్తూ ఊరుకోబోదని, అమరావతి రైతులకు న్యాయం జరిగేదాకా పోరాడుతామని నేతలు వ్యాఖ్యానించారు. జాతీయ నేత రాంమాధవ్ మరో అడుగు ముందుకేసి, అంత పెద్ద యూపీనే ఒక్క రాజధానితో అభివృద్ధి సాధిస్తుండగా, ఏపీకి మూడు రాజధానులు అవసరమా? అని జగన్ ను నిలదీశారు. ఏది ఏమైనా ఏపీ రాజధానుల విషయంలో బీజేపీ వేరు, కేంద్రం వేరు అనే వాస్తవాన్ని తెలియజెప్పేందుకు నేతలు ప్రయత్నించారు. బీజేపీ నేతల కామెంట్లపై వైసీపీ వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించింది.