రాజధానిపై వల్లభనేని వంశీ అనూహ్య కామెంట్లు - ఉపఎన్నికకు సిద్ధం - ఆ 29 ఎమ్మెల్యేలపై ఒత్తిడి?
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు ఉనికిలోకి వచ్చిన తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా కాకుండా కేవలం శానస రాజధానిగానే మార్చడం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోన్న ప్రతిపక్షాలు.. కృష్ణా, గుంటూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలనే డిమాండ్ తెరపైకి తెచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరుగుతోందన్న దశలోనే.. ఆ పార్టీకి అనుబంధంగా కొనసాగుతోన్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అనూహ్య కామెంట్లు చేశారు. రాజధాని తరలింపుతో తన నియోజకవర్గ ప్రజలు నష్టపోయారని, వాళ్ల కోసం రాజీనామా చేస్తానని చెప్పారు.
Recommended Video
రాజధానిపై సీఎం జగన్ మరో కీలక నిర్ణయం - తరలింపునకు ముందే 4 జోన్ల ఏర్పాటు - చైర్మన్లు ఎవరంటే..
రాజధాని రిఫరెండంగా ఉప ఎన్నిక..
‘‘ప్రస్తుతం అమరావతి మీద లక్ష కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. అన్ని ప్రాంతాలను సమంగా చూడాలనే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. లేకపోతే, ఒకప్పటి తెలంగాణలో వచ్చిట్లే రాబోయే రోజుల్లో ఏపీలోనూ అసమానతలు పెరిగిపోయే ప్రమాదముంది. అయితే, అమరావతికి పూర్తిస్థాయి రాజధాని హోదా తీసేయడంతో నా నియోజకవర్గంలోని రైతులు నష్టపోయారు. వాళ్ల ఆకాంక్షలకు అనుగుణంగా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తాను. రాజధాని అంశమే రిఫరెండంగా ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాను''అని వంశీ అన్నారు. అయితే,
సీఎంకు కూడా ఇదే చెప్పా..
రాజధాని అంశమే రిఫరెండంగా గన్నవరం ఉప ఎన్నికకు తాను సిద్ధంగా ఉన్న విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కూడా తెలియజేశానని ఎమ్మెల్యే వంశీ స్పష్టం చేశారు. కాగా, కరోనా పరిస్థితుల కారణంగా ప్రస్తుతం ఎన్నికలు జరిగే అవకాశం లేనందున వేచిచూస్తున్నానన్న ఆయన.. తన ఉప ఎన్నికను రాజధాని అంశంతో ముడి పెట్టాలా వద్దా అనేది టీడీపీనే తేల్చుకోవాలని సవాలు విసిరారు. మూడు రాజధానుల అంశంలో అసెంబ్లీని రద్దు చేయాలంటూ కొందరు డిమాండ్ చేస్తుండటం హాస్యాస్పదంగా ఉందని వల్లభనేని అన్నారు. ఇదిలా ఉంటే,
వైసీపీలో ముసలం? రాజీనామాలు??
ఏపీలో మూడు రాజధానులు ఉనికిలోకి రావడంతో అధికార వైసీపీలో ముసలం మొదలైందంటూ గడిచిన కొద్ది గంటలుగా మెయిన్ స్ట్రీమ్, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. ప్రధానంగా.. కృష్ణ, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని, పార్టీ పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా, ప్రభుత్వ పరంగా రాజధానుల్ని ఏర్పాటు చేసిన తీరుపై ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారని, ఈ నిర్ణయంతో తమ రాజకీయ భవిష్యత్తుకు దెబ్బ తప్పదని వాళ్లు భావిస్తున్నారని, రెండు జిల్లాకు చెందిన మొత్తం 29 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధపడ్డారని, విజయవాడలో ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్తకి చెందిన ఒక హోటల్ లో ఈ మేరకు రహస్య మంతనాలు కూడా చేశారని ప్రచారం జరుగుతోంది. దీన్ని అధికార పార్టీ నేతలు ఖండించకపోవడం గమనార్హం.
పులివెందుల టు అమరావతి..
వల్లభనేని వంశీ వ్యాఖ్యలు, రెండు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనాలు చేస్తారనే పుకార్ల నడుమ ప్రతిపక్ష టీడీపీ, జనసేనలు తమ విమర్శలకు పదును పెట్టారు. కృష్ణా, గుంటూరు వైసీపీ ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేయాలని జనసేనాని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. రాజధాని అంశంలో గవర్నర్ నిర్ణయాన్ని నిరసిస్తూ ఇప్పటికే రాజీనామా చేసిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సైతం ఇదే సవాలు విసిరారు. సోమవారం పులివెందుల నుంచి అమరావతి చేరుకోనున్న ఆయనకు ఘన స్వాగతం పలికేలా టీడీపీ శ్రేణులు, అమరావతి ఉద్యమకారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తుళ్లూరులోని రాజధాని రైతుల శిబిరానికి ఆయన వెళ్లనున్నారు. ‘‘రాయలసీమ నుంచి నేనే రాజీనామా చేశాను. అలాంటిది రాజధాని ఉండే గుంటూరు, కృష్ణా జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేయరు?''అని బీటెక్ రవి ప్రశ్నించారు.
ఆగస్టు 6 వరకే జగన్ తాత్కాలిక ఆనందం - ఉసురు తప్పదన్న టీడీపీ - పాఠ్యాంశంగా తరలింపంటూ..