రాజధానిపై సీఎం జగన్ మరో కీలక నిర్ణయం - తరలింపునకు ముందే 4 జోన్ల ఏర్పాటు - చైర్మన్లు ఎవరంటే..
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన పాలనా వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించిన తర్వాత జగన్ సర్కారు జెట్ స్పీడులో నిర్ణయాలు తీసుకుంటున్నది. దసరాలోగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలిస్తారనే వార్తల నడుమ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది.
రాజధాని తరలింపు కంటే ముందుగా.. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు(రీజనల్ డెవలప్మెంట్ జోన్లు) ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించినట్లు తెలిసింది. వివిధ శాఖల హెచ్వోడీ కార్యాలయాలు సైతం కొలువుదీరనున్న ఆయా జోన్లకు చైర్మన్లుగా అధికార పార్టీ నేతలకే అవకాశం కల్పించనుండటంతో ఈ వ్యవహారం రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది.
జీఎన్ రావు చెప్పినట్లే..
ఏపీలో పాలన వికేంద్రీకరణపై కీలక అధ్యయనాలు చేసిన జీఎన్ రావు కమిటీ తొలిగా జోన్ల ఏర్పాటును సూచించింది. ఉత్తర కోస్తా, మధ్య కోస్తా ప్రాంతాల్లోనే అర్బనైజేషన్ ఎక్కువగా ఉందని, అందువల్ల అభివృద్ధి విషయంలోనూ కోస్తాపై ఒత్తిడి ఎక్కువగా ఉందని, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలపై మరింత ఫోకస్ పెంచడం ద్వారా ఒకే ప్రాంతంపై ఒత్తిడిని తగ్గించొచ్చని జీఎన్ రావు కమిటీ తెలిపింది. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఏపీని 4 జోన్లుగా చూడాలని, ఆయా జోన్లలో ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ అంశానికి అధిక ప్రాధాన్యం ఇస్తోన్న సీఎం జగన్.. రాజధాని తరలింపునకు ముందే జోన్ల ఏర్పాటు ప్రక్రియను ముగించాలని నిర్ణయం తీసుకున్నారు.
కొత్త సెటప్ తో లాభమేంటి?
వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత సమగ్ర అభివృద్ధిపై ఫోకస్ పెంచింది. వికేంద్రీకరణపై ఏర్పాటైన జీఎన్ రావు, బోస్టన్ తదితర కమిటీల సూచనలను కూడా పరిగణలోకి తీసుకుని.. 13 జిల్లాలను 4 జోన్లుగా విభజించాలని నిర్ణయించుకుంది. ఒక్కో జోన్ పరిధిలో ప్రధాన శాఖల రాష్ట్రస్థాయి కార్యాలయాలు, భారీ పరిశ్రమలు నెలకొల్పాలని, తద్వారా ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలని సర్కారు భావిస్తున్నది. రాజధాని తరలింపు కంటే మందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలనుకుంటోన్న సీఎం జగన్.. అందుకు సంబంధించిన కసరత్తును చేపట్టినట్లు సమాచారం.
ఆ నాలుగు జోన్లు ఏవంటే..
అన్ని జిల్లాలు కలిపి మొత్తం నాలుగు జోన్లుగా విభజిస్తారు. విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడపలను జోనల్ కేంద్రాలుగా గుర్తించబోతున్నారు. విజయనగరం జోన్ పరిధిలోకి కొత్త రాజధాని విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు వస్తాయి. కాకినాడ జోన్ పరిధిలో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలతోపాటు అనూహ్యంగా కృష్ణాను కూడా కలపబోతున్నారు. ఇక గుంటూరు జోన్ పరిధిలో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలు వస్తాయి. సీఎం సొంత జిల్లా కడప కేంద్రంగా ఏర్పాటు కాబోయే జోన్ పరిధిలో సీమలోని నాలుగు జిల్లాలు(చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప) ఉంటాయి.
ఒక్కో జోన్ కు ఒక్కో ప్రత్యేకత..
రాష్ట్రంలో ఏర్పాటు కాబోయే నాలుగు జోన్లు వేటికవే ప్రత్యేకంగా నిలబడేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆయా జోన్లలోని ప్రత్యేకత పరిస్థితులు, అక్కడ అందుబాటులో ఉన్న వనరులు తదితర అంశాల దృష్ట్యా వేర్వేరు వ్యూహాలను జగన్ సర్కారు సిద్దం చేస్తున్నది. ఉదాహరణకు, విజయనగరం జోన్ పరిధిలోకి వచ్చే కొత్త రాజధాని విశాఖలో ఐటీ హబ్ ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వనుండగా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మైనింగ్, గిరిజన సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు. కాకినాడ జోన్ లో ఆక్వా, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యమిస్తూ చర్యలు చేపడతారు. గుంటూరు జోన్ పరిధిలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పోర్టులు, ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యం ఇస్తారు. కడప జోన్ లో హార్టికల్చర్, చిరుధాన్యాల బోర్డు, ఇతర పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తోంది.
Recommended Video
జోన్ల చైర్మన్లకు మంత్రి హోదా..
ఏపీ సర్కారు కొత్తగా ఏర్పాటు చేయనున్న నాలుగు రీజనల్ డెవలప్మెంట్ జోన్ల పర్యవేక్షణ కోసం భారీ సెటప్ రూపొందించబోతున్నట్లు సమాచారం. బోర్డు పరిధిలో చైర్మన్ తోపాటు ఏడుగురు సభ్యులు ఉండేలా కమిటీ ఉంటుందని, ఆయా జోన్ల చైర్మన్లకు కేబినెట్ ర్యాంకు హోదా కూడా కల్పించబోతున్నారని తెలుస్తోంది. మంత్రి పదవితో సమానంగా జోన్ల చైర్మన్లను ట్రీట్ చేయబోతున్నారన్న సమాచారం అధికార వైసీపీ నేతల్లోని ఆశావాహులకు తీపి కబురులా మారింది. మంత్రి పదవులు ఆశించి, చివరి నిమిషంలో అవకాశం కోల్పోయిన ఎమ్మెల్యేలు, గతంలోనే జగన్ నుంచి మాట పొందిన ఇతర కీలక నేతలు ఈ పదవుల కోసం పోటీపడే అవకాశముంది.