కేంద్రం కరుణించినా రాజధానులపై నిస్సహాయత- అమరావతి లెక్కలు తేల్చాకే- జగన్ అడుగులపై ఆసక్తి...
ఏపీలో ప్రస్తుత రాజధాని అమరావతి వ్యవహారంలో రోజుకో విధంగా చోటు చేసుకుంటున్న ట్విస్ట్లు జగన్ సర్కార్ భవిష్యత్ ప్రణాళికలకు ఆటంకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అమరావతి కోసం పెట్టిన ఖర్చుపై తాజాగా బయటపడుతున్న లెక్కలు రాష్ట్ర ప్రభుత్వాన్ని మరింత ఇరుకున పెట్టేలా ఉన్నాయి. అమరావతి ఖర్చుపై అకౌంటెంట్ జనరల్ ను లెక్కలు అడిగినా అవి ఇప్పటికిప్పుడు ఇచ్చే అవకాశం ఉందా అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. వీటిపై హైకోర్టుకు క్లారిటీ ఇచ్చాకే ముందడుగు వేసే పరిస్ధితులు ఉండటంతో జగన్ సర్కార్ ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టబోతోంది.
అమరావతి పేరులోనే సాధికారత, అంగుళం కూడా కదల్చలేరు, మడమ తిప్పి: టీడీపీ అనిత
అమరావతి - తెరపైకి కొత్త లెక్కలు..
అమరావతిని ఏపీ రాజధానిగా అట్టహాసంగా ఎంచుకున్న గత టీడీపీ ప్రభుత్వం వాస్తవంగా దానిపై పెట్టిన ఖర్చెంత అంటే నిన్న మొన్నటి వరకూ పది వేల కోట్ల వరకూ చెప్పేవారు. కాదు కాదు ఐదు వేల కోట్లే అని గతేడాది వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చాక తేల్చేసింది. ఇందులో కేంద్రం ఇచ్చిన రెండున్నర వేల కోట్లు కూడా ఉన్నాయనేది అప్పట్లో తేలిన లెక్క. కానీ ఇప్పుడు తాజాగా హైకోర్టులో సీఆర్డీయే రికార్డుల ప్రకారం అమరావతి కోసం ఇప్పటివరకూ రూ.52 వేల కోట్లు ఖర్చు చేశారని ఓ న్యాయవాది చెప్పడం, అదే నిజమైతే ప్రజాధనం వృథా అవుతుంటే చూస్తూ ఊరుకోలేమంటూ హైకోర్టు ట్విస్ట్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. కానీ వాస్తవంగా ఖర్చు చేసిన మొత్తం తేలాలంటే అకౌంటెంట్ జనరల్ నివేదిక కీలకం కానుంది.
తేల్చాల్సింది అకౌంటెంట్ జనరల్..
అమరావతిపై గత టీడీపీ ప్రభుత్వమైనా, ప్రస్తుత వైసీపీ సర్కారు అయినా ఎంత ఖర్చుపెట్టారో తేలాలంటే రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ పాత్ర కీలకంగా మారింది. అమరావతిపై పెట్టిన ఖర్చు తేలకుండా ఈ వ్యవహారంలో ముందుకెళ్లేదెలా అంటూ హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే అకౌంటెంట్ జనరల్ ను తమ పిటిషన్లలో ప్రతివాదిగా చేర్చాలని రైతులకు హైకోర్టే సలహా ఇచ్చింది. ఆ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. కరోనా కారణంగా ఆన్ లైన్ పిటిషన్లు దాఖలు చేయాల్సిన పరిస్ధితుల్లో ఇది ఆలస్యమవుతోంది. ఓసారి అకౌంటెంట్ జనరల్ అమరావతిపై పెట్టిన ఖర్చు తేలిస్తే కానీ మిగతా వ్యవహారాలు ఓ కొలిక్కి వచ్చేలా లేవు. దీంతో రాజధాని తరలింపులో ఇప్పుడు ఏజీ నివేదికే కీలకంగా మారిపోయింది.
కేంద్రం కరుణించినా హైకోర్టు బ్రేకులు..
రాజధాని విషయంలో జగన్ సర్కారుకు కేంద్రం నుంచి పూర్తిగా అండదండలు లభిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో బీజేపీ నేతలు కూడా ఎదురు మాట్లాడలేని పరిస్ధితి. రాజధాని విషయంలో తమ జోక్యం ఉండబోదని పదేపదే చెబుతూ వచ్చిన కేంద్రం.. తాజాగా నిన్న హైకోర్టులో ఆ మేరకు అఫిడవిట్ కూడా దాఖలు చేయడంతో ఇక కేంద్రం పాత్ర అనే మాట విలువ కోల్పోయింది. కానీ హైకోర్టు తాజాగా లేవనెత్తుతున్న అభ్యంతరాలతో కేంద్రం ఇచ్చిన వెసులుబాటు కూడా ప్రాధాన్యం కోల్పోయే పరిస్ధితి వచ్చింది. ఓ రకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయదల్చుకున్న పనికి న్యాయప్రక్రియ అడ్డంకిగా మారినట్లయింది. దీంతో ఇప్పుడు న్యాయపరమైన ఇబ్బందులను అధిగమించే విషయంలో జగన్ సర్కారు ఏం చేయబోతోందన్న ఆసక్తి నెలకొంది.
Recommended Video
జగన్ ముందు ఆప్షన్లు ఇవే...
కేంద్రం రాజధాని విషయంలో క్లారిటీ ఇచ్చేసినా న్యాయప్రక్రియ అడ్డంకిగా మారిన నేపథ్యంలో జగన్ తదుపరి అడుగులు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా అమరావతి విషయంలో ఏజీ నివేదిక కీలకంగా మారడంతో ఆ మేరకు దాన్ని సాధ్యమైనంత త్వరగా తెప్పించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించనుంది. అలాగే ఇప్పటికే చెప్తున్నట్లుగా సీఆర్డీయే రాజధానిపై పెట్టిన ఖర్చు విషయంలోనూ హైకోర్టుకు క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఓ న్యాయవాది చెప్పినట్లు రూ.52 వేల కోట్లు ఖర్చుపెట్టారని అనుకున్నా అందుకు ఆధారాలు కనిపించడం లేదు. ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్లో సైతం అమరావతి కోసం ఇంత భారీ మొత్తం ఎక్కడా కేటాయించలేదు. కేంద్రం ఇచ్చిన నిధులు కూడా రూ.2500 కోట్లే. దీంతో ఈ ఖర్చు అంతా ఫేక్ అని నిరూపించడంతో పాటు అవసరమైతే అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుంది కాబట్టి ఇక్కడ నిర్మాణాలు కొనసాగుతాయనే హామీని హైకోర్టు ఇచ్చి ఈ వ్యవహారం నుంచి బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి.