3 రాజధానులపై ప్రకృతి ప్రకోపం -మందడంలో శిబిరం కూలడమే నిదర్శనం: వైసీపీ ఎంపీ
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల వ్యవహారంలో జగన్ సర్కారుకు కోర్టుల నుంచి తీవ్రమైన ఎదురుదెబ్బలు తగులుతోన్న వేళ.. ప్రకృతికి సైతం రాజధాని మార్పు ఇష్టం లేదంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాజధాని అమరావతిలో కొద్ది గంటల కిందట చోటుచేసుకున్న ఘటన చుట్టూ రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఓ అడుగు ముందుకేసి.. ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్లొద్దని సీఎం జగన్ కు సూచించారు. వివరాల్లోకి వెళితే..
నిమ్మగడ్డ అంటే భయమా? సుప్రీం షాకింగ్ తీర్పు -6లక్షలమంది ఏడుపు: ఎంపీ రఘరామ
రైతులు వర్సెస్ కూలీలు
ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించాలనే ప్రతిపాదన ప్రారంభమైనప్పటి నుంచే స్థానికంగా రైతులు, కూలీలు, మహిళలు పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం నాటికి నిరసనలు 324వ రోజుకు చేరాయి. అయితే రైతుల దీక్షకు వ్యతిరేకంగా.. మూడు రాజధానులను సమర్థిస్తూ అమరావతి పరిధిలోకే వచ్చే కొందరు వ్యక్తులు కొద్ది రోజులుగా పోటీ దీక్షలు చేస్తున్నారు. తమను కూడా కూలీలు, రైతులుగా చెప్పుకుంటోన్న ఆ వ్యక్తులు.. మందడం సీడ్ యాక్సిస్ రోడ్ వద్ద భారీ శిబిరాన్ని ఏర్పాటు చేసి దీక్షలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో..
కూలిన శిబిరం..
అమరావతి రైతల దీక్షలకు పోటీగా మూడు రాజధానులను సమర్థిస్తూ, ఏపీ వ్యాప్తంగా 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలను ఇవ్వాలని కోరుతూ మందడంలో పోటీ శిబిరాలను ఏర్పాటు చేయగా, మంగళవారం సాయంత్రంనాటి గాలివానకు ఆ టెంట్లు కూలిపోయాయి. నిరసన కారులు ఖాళీచేసి వెళ్లిపోయిన తర్వాత సాయంత్రం సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఎవరికీ ఏమీ కాలేదు. తిరిగి బుధవారం ఈ శిబిరం ప్రారంభం కావాల్సి ఉండగా, ఇంతవరకు ప్రారంభంకాలేదని తెలుస్తోంది. దీనిపై..
ప్రకృతికి కూడా నచ్చలేదు..
మూడు రాజధానులకు అనుకూలంగా ఏర్పాటు చేసిన దీక్షా శిబిరం కూలిపోవడంతో రాజధాని తరలింపు లేదా మూడు రాజధానుల నిర్ణయం ప్రకృతికి కూడా నచ్చడం లేదని స్థానికంగా జనం మాట్లాడుకుంటున్నారు. ఇదే అంశంపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రకృతి కూడా కొన్నిదుష్ట శక్తుల్ని ప్రోత్సహించదని చెప్పడానికి ఇదే నిదర్శనం అంటూ కూలిపోయిన శిబిరం ఫోటోలను చూపించారు.
అక్కడ గడ్డపరక కూడా చెదరలేదు
‘అమరావతి ఉద్యమానికి వ్యతిరేకంగా వైసీపీ నేతల ఆధ్వర్యంలో ఆటో ఆర్టిస్టులు పోటీ శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆ పెయిడ్ ఆర్టిసులు నిర్మించిన శిబిరాలే ఇప్పుడు పడిపోయాయి. నిజమైన రైతులు రాజధాని అమరావతి కోసం ఎక్కడ ఆందోళన చేస్తున్నారో.. అక్కడ చిన్న గడ్డిపరక కూడా చెక్కు చెదరలేదు. ప్రకృతి ప్రకోపాన్ని బట్టయినా న్యాయం ఎటువైపు ఉందో ముఖ్యమంత్రి జగన్ ఒక్కసారి ఆలోచించాలి. ప్రకృతికి మించిన శక్తి లేదని గుర్తించాలి'' అని ఎంపీ రఘురామ వ్యాఖ్యానించారు.
జడ్జికే జైలు, జగన్ తప్పించుకోలేరు -అటార్నీ చెప్పిందిదే -పీపీఏను బెదిరిస్తే పైసలొస్తాయా?: రఘురామ