చిట్టా విప్పిన విజయసాయిరెడ్డి - షాకింగ్ ఆరోపణలు - 48 గంటల డెడ్ లైన్ పై డెడ్లీ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు ఉనికిలో రావడంతో రాజకీయ అగ్నిపర్వతం బద్దలైనంత స్థాయిలో నేతలు ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు. అసెంబ్లీని రద్దు చేసి, అమరావతిని రిఫరెండంగా తీసుకుని మళ్లీ ఎన్నికలకు వెళ్లే విషయమై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన సవాళ్లు-ప్రతిసవాళ్లు విసురుకుంటున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబుపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి అనూహ్యరీతిలో విరుచుకుపడ్డారు. అంతేకాదు, 'శ్రీకాకుళం జిల్లాను చిదిమేశారు' అంటూ సాయిరెడ్డి ప్రారంభించిన విమర్శల సిరీస్ పార్ట్-2, పార్ట్-3లో అచ్చెన్నాయుడిపై షాకింగ్ ఆరోపణలు చేశారు.
సీఎం జగన్ మరో రెండు కీలక నిర్ణయాలు - ఏపీ వ్యాప్తంగా ఆ కమిటీలు రద్దు - నకిలీలపై ఇంటెలిజెన్స్ నిఘా..
దాన్ని డెడ్ లైన్ అంటారా?
అమరావతి స్థాయిని పూర్తి స్థాయి రాజధాని నుంచి శాసన రాజధానిగా కుదించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈనెల 6న హైకోర్టులో విచారణ జరుగనుంది. దానికి ఒక రోజు ముందే.. అసెంబ్లీని రద్దు చేయాలంటూ జగన్ సర్కారుకు టీడీపీ చీఫ్ చంద్రబాబు డెడ్ లైన్ విధించారు. అయితే చంద్రబాబు తీరు.. పోలీసులను సవాలు చేసే నేరగాడిలా, డాక్టర్ కు డెడ్ లైన్ విధించే రోగిలా ఉందని సాయిరెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రజా ప్రభుత్వానికి.. చిత్తుగా ఓడిన చంద్రబాబు డెడ్ లైన్ ఇవ్వడం హాస్యాస్పదమని, డెడ్ పార్టీ అయిన టీడీపీకి చంద్రబాబుది డెడ్ లీడర్ షిప్ అని, అసలీ అరుపుల్ని డెడ్ లైన్ అని కూడా అంటారా? అని వైసీపీ ఎంపీ ఎద్దేవా చేశారు.
పార్ట్-2, పార్ట్-3లో సంచలనాలు..
ఉమ్మడి రాష్ట్రంలోగానీ, విడిపోయిన తర్వాతగానీ ఉత్తరాంధ్రకు టీడీపీ తీరని అన్యాయం చేసిందని, వాటికి శాశ్వత పరిష్కారాలు చూపేందుకే సీఎం జగన్ మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నారని ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రధానంగా ‘శ్రీకాకుళం జిల్లాను చిదిమేశారు' అంటూ విమర్శల సిరీస్ మొదలు పెట్టిన ఆయన.. పార్ట్-1లో కళింగ, రెడ్డిక కులాల పట్ల టీడీపీ తీరును ఎకరువు పెట్టారు. తాజాగా విడుదల చేసిన పార్ట్-2, పార్ట్-3లో అచ్చెన్నాయుడి కుటుంబంపై సంచలన ఆరోపణలు గుప్పించారు. ఎంపీ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..
హింసించడమే వారి సిద్ధాంతం..
‘‘శ్రీకాకుళం జిల్లా ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉండేది. కానీ అభివృద్ధి జరిగింది మాత్రం వైఎస్ హయాంలో.. మళ్లీ ఇప్పుడు జగన్ పాలనలో మాత్రమే. చంద్రబాబు హయాంలో కేవలం కొన్ని కుటుంబాలకు లబ్ధి తప్ప చేసిందేమీ లేదు. తాము పోటీ చేసిన నియోజకవర్గాల్లో రెడ్డిక, మత్స్యకార కులాల ఓట్లతోనే ఎర్రన్నాయుడు గానీ, అచ్చెన్నాయుడు గానీ నెగ్గుకొచ్చారు. కానీ ఆ కులాలకు ఒక్కటంటే ఒక్క నామినేటెడ్ పోస్ట్ కూడా ఇవ్వలేదు. ఎన్నికల సమయంలో బకరాలు చేయడంలో మాత్రం చంద్రన్న - అచ్చన్న దిట్టలే. ఎన్నికల సమయంలో మత్స్యకారుల్ని మేనేజ్ చేయడం, బెదిరించడం, హింసించడమే టీడీపీ నేతల సిద్ధాంతం. వందల సార్లు ప్రాదేయపడినా ఎర్రన్న, అచ్చెన్నలు ఒక్క కోల్డ్ స్టోరేజీ కట్టించలేదు. బస్ షెల్టర్లు కట్టించి, వాటిపై తమ పేర్లును బస్సుకన్నా పెద్ద సైజులో రాయించుకోవడం తప్ప చేసిందేమీ లేదు.
వైసీపీ విజయసాయి రెడ్డి కొత్త సిరీస్ - పార్ట్-1లో ఆ రెండు కులాలు - ఎర్రన్నాయుడు ఫ్యామిలీపై అనూహ్యం..
సొంతూళ్లో అచ్చెన్న అత్యాచారం?
చంద్రబాబు డైరెక్షన్ లో జిల్లాలో ఒకే కులంలో చిచ్చుపెట్టడం, మందు, మనీతో ఎలక్షన్ల సమయంలో చేరదీయడం గొడవలుపెట్టి పబ్బం గడుపుకోవడం ఎర్రన్నాయుడి కుటుంబ స్టైల్. ఇప్పటి స్పీకర్ తమ్మినేని సీతారాం సహా టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ తదితరులంతా ఒకప్పుడు బాధితులే. గత ఎన్నికల్లో కోటబొమ్మలి మండలం పిన్నింటిపేట కూడలి వద్ద జరిగిన టైలర్ కూన రామారావు హత్యతో అచ్చెన్న ఏ1, కానిస్టేబుల్ ను కొట్టిన కేసులో నరసన్నపేట కోర్టు అచ్చెన్నాయుడుకు ౩ నెలల జైలు శిక్ష వేసింది. సొంత గ్రామం నిమ్మాడలో అచ్చెన్నపై అత్యాచారం కేసు నమోదుకాగా, ఆయన మంత్రయ్యాక చంద్రబాబు ప్రభుత్వం వీటన్నింటినీ పక్కదోవపట్టించింది. వీళ్ల అరాచకాల గురించి తెలుసుకాబట్టే.. అచ్చెన్నాయుడు అరెస్టు రోజు శ్రీకాకుళం జిల్లాలో జనం బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
Recommended Video
ఉత్తరాంధ్రపై టాలీవుడ్ పెద్దల ఫోకస్..
పలాస, టెక్కలి, నందిగామ,వజ్రపుకొత్తూరు సహా... శ్రీకాకుళంలో చాలా ప్రాంతానికి నీటి సదుపాయం కల్పించాలన్న సంకల్పంతో 2008లో వైఎస్ఆర్ ‘ఆఫ్ షోర్' ప్రాజెక్టుకు శంకు స్థాపన చేశారు. కానీ తర్వాతి కాలంలో చంద్రబాబు దాన్ని కదలనీయకుండా అడ్డుకున్నాడు. మహేంద్ర తనయ నీటిని సముద్రంపాల్జేశాడు. మళ్లీ ఇప్పుడు జగన్ రాకతో ఉత్తరాంధ్రలో, ప్రత్యేకించి శ్రీకాకుళంలో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. వంశధార ప్రాజెక్టు, ఆఫ్ షోర్ ప్రాజెక్టు, ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు, పలాసలో 600 పడకల కిడ్నీ పేషెంట్ల కోసం ఆస్పత్రి , కిడ్నీ పేషెంట్లకు 10 పెన్షన్ , మెడికల్ కాలేజ్ , ఇరిగేషన్ పెంపు ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో. సహజసిద్ధ అందాలకు నెలవైన ఉత్తరాంధ్రను పర్యాటక ప్రాంతాలుగా, షూటింగ్ స్పాట్స్గా అభివృద్ధి చేయాలని జగన్ సంకల్పించారు. టాలీవుడ్ ప్రముఖులుకూడా వీటిపై దృష్టిపెట్టారు. దీనివల్ల పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే వలసలు ఆపేందుకు శ్రీకాకుళంలో పారిశ్రామిక , సేవల రంగాలను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం’’అని విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు. శ్రీకాకుళం జిల్లాను చిదిమేశారంటూ వైసీపీ ఎంపీ చేసిన ఆరోపణలపై టీడీపీగానీ, అచ్చెన్నాయుడు ఫ్యామిలీగానీ స్పందించాల్సి ఉంది.