తెలంగాణ నుంచి ఏపీలో ఎంట్రీపై బ్యాన్: రోజూ 12 గంటలే గడువు: ఆ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ఉంటేనే
అమరావతి: రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతుండటంతో ప్రభుత్వం కఠిన చర్యలను తీసుకుంటోంది. రోజూ వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో రాష్ట్ర సరిహద్దులను పాక్షికంగా మూసివేసింది. కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అవుతోన్న తెలంగాణ నుంచి రాష్ట్రానికి వచ్చే సరిహద్దులు రోజులో 12 గంటల పాటు మూసి ఉంటాయి. ఈ మేరకు గుంటూరు జిల్లా పోలీసులు తెలంగాణ పోలీసు యంత్రాంగానికి సమాచారం ఇచ్చారు.
Recommended Video
తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వాహనాలకు సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు అనుమతి ఇవ్వరు. ఈ 12 గంటల సమయంలో ప్రైవేటు, వ్యక్తిగత వాహనాలకు అనుమతి ఇవ్వరు. లారీలు, భారీ ట్రక్కులు, ప్రభుత్వ వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తారు. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లాలనుకునే వారికి ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే అనుమతి ఇస్తారు. ఆ తరువాత ఎంట్రీ ఉండదు.
ఏపీకి రావాలనుకునే వారు ప్రభుత్వం రూపొందించిన స్పందన వెబ్సైట్లో తప్పనిసరిగా తమ వివరాలను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. https://www.spandana.ap.gov.in/ వెబ్సైట్లో తాము, తమతో వచ్చే వారి వివరాలన్నింటినీ పొందుపర్చాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలను సరిహద్దుల్లో తనిఖీ సిబ్బందికి చూపించాల్సి ఉంటుంది. ఆ తరువాతే ఏపీలో ప్రవేశించడానికి అనుమతి ఇస్తామని నల్లగొండ జిల్లా ఎస్పీ వెంకట రంగనాథ్ తెలిపారు.
రఘురామకు బుల్లెట్ ప్రూఫ్ కారు: వై లేదా వై ప్లస్ సెక్యూరిటీ? ఇక బీజేపీకి అనుబంధ సభ్యుడిగా?
తెలంగాణ వైపు నుంచి ఏపీలోకి ప్రవేశించే వాహనాలపై ఆంక్షలు విధించినట్లు గుంటూరు జిల్లా పోలీసులు ఇచ్చిన సమాచారానికి అనుగుణంగా తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఎస్పీ రంగనాథ్ పేర్కొన్నారు. నాగార్జున సాగర్, మాచర్ల మీదుగా ఏపీలోకి వెళ్లే అవకాశం లేదని అన్నారు. దీన్ని ఏపీ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రోడ్డుగా గుర్తించ లేదని అన్నారు. అందువల్లే ఈ మార్గాన్ని పూర్తిగా మూసివేసినట్లు ఎస్పీ చెప్పారు. ఏపీకి వెళ్లాలనుకునే వారు వాడపల్లి మీదుగా మాత్రమే తమ ప్రయాణాన్ని కొనసాగించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.