తెలంగాణా మద్యం షాపుల కోసం పోటీ పడిన ఏపీ వ్యాపారులు .. ఎందుకంటే
ఆంధ్రప్రదేశ్లోని మద్యం వ్యాపారులు ఈసారి తెలంగాణ రాష్ట్రంపై దృష్టి పెట్టారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీ అమలు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ షాప్ ల లైసెన్సుల కోసం వేసిన దరఖాస్తుల లో అధిక భాగం ఆంధ్రప్రదేశ్ కు చెందిన మద్యం వ్యాపారులు వేసినవే.
తెలంగాణా లిక్కర్ లైసెన్సుల కోసం ఏపీ వ్యాపారుల పోటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం షాపులు నిర్వహించాలని నిర్ణయం తీసుకొని, ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహిస్తున్న నేపథ్యంలో అక్కడ మద్యం వ్యాపారులు మన రాష్ట్రంలోని జిల్లాలపై తమ దృష్టిని కేంద్రీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దు జిల్లాలైన నల్గొండ,మహబూబ్ నగర్,ఖమ్మం లలో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు దాఖలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం మద్యం దరఖాస్తు చేయడానికి రుసుమును లక్ష రూపాయల నుండి రెండు లక్షలకు పెంచినప్పటికీ ఏపీ కి సంబంధించిన చాలామంది మద్యం వ్యాపారులు దరఖాస్తు చేసినట్లుగా తెలుస్తుంది.
ఏపీ సరిహద్దు జిల్లాల్లో భారీగా దరఖాస్తులు
తెలంగాణ రాష్ట్రంలో లైసెన్సు పొందిన మద్యం దుకాణాల సంఖ్య 2216. అయితే ఈ దుకాణాల కోసం వేసిన దరఖాస్తులను చూస్తే 45 వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చినట్లుగా అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున దరఖాస్తులు చేశారు. ఇక కడప మరియు కర్నూలుకు చెందిన మద్యం వ్యాపారులు మహబూబ్ నగర్ మరియు గ్రేటర్ హైదరాబాద్ లో దరఖాస్తులు చేసినట్లుగా తెలుస్తుంది. కృష్ణా , గుంటూరు , తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల వ్యాపారులు నల్గొండ మరియు ఖమ్మంలో లైసెన్సులు పొందడానికి పోటీ పడుతున్నట్లుగా తెలుస్తుంది.
ఏపీ కొత్త ఎక్సైజ్ పాలసి వల్లే ఈ నిర్ణయం
ఎంతోకాలంగా మద్యం వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ఏపీ ట్రేడర్స్ ఏపీలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్ షాప్ ల కోసం టెండర్లు వేశారు. మద్యం షాపుల నిర్వహణ తప్ప తమకు వేరే పని తెలియదని చెప్తున్న నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం నుండి దరఖాస్తు చేసినట్లుగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్ షాపులను నిర్వహించడానికి ఉత్సాహంగా ఉన్న ఏపీ మద్యం దుకాణం దారులకు తెలంగాణ ప్రభుత్వ సహకారం అందించింది.
తెలంగాణా సర్కార్ కు 200 కోట్ల అదనపు ఆదాయం పెంచిన ఏపీ వ్యాపారులు
ఏపీ వ్యాపారుల సంశయాలు తీర్చడం కోసం కౌంటర్లను సైతం ఏర్పాటు చేసింది. దీంతో పెద్ద ఎత్తున ఏపీ వ్యాపారులు మద్యం షాపుల కోసం దరఖాస్తులు వేశారు. మొత్తానికి పక్క రాష్ట్రంలో మద్యం పాలసీ తెలంగాణ రాష్ట్రానికి బాగానే కలిసొచ్చింది. తెలంగాణ ఆర్టీసీ సమ్మె ఏపీకి కాసుల పంట పండిస్తే, ఏపీ మద్యం పాలసీ ప్రభావం తెలంగాణ మద్యం దరఖాస్తులలో కనిపించటంతో తెలంగాణా ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించింది.ఒక్క ఏపీ మద్యం వ్యాపారుల దరఖాస్తుల ద్వారానే తెలంగాణా సర్కార్ కు 200కోట్ల అదనపు ఆదాయం వచ్చినట్టు అంచనా.