తెలంగాణ రవాణా శాఖకు ఏపీ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కీలక లేఖ...
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు గతంలో మాదిరి పూర్తి స్థాయి బస్సు సర్వీసులు నడపాలనుకుంటున్నామని రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. తెలంగాణ నుంచి ఏపీకి బస్సు సర్వీసులను పెంచుకోవాలని సూచించారు. ఈ మేరకు తెలంగాణ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మకు లేఖ రాశారు.
ఇటీవలి భేటీలో తెలంగాణలో 1.12లక్షల కి.మీ మేర సర్వీసులు తగ్గించుకోవాలని టీఎస్ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీని కోరిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో 56వేల కి.మీ మేర సర్వీసులను తగ్గించుకుంటామన్న ఏపీఎస్ఆర్టీసీ... అంతే మేర ఏపీలో టీఎస్ఆర్టీసీ సర్వీసులను పెంచుకోవాలని ప్రతిపాదించింది. అయితే టీఎస్ఆర్టీసీ అధికారుల నుంచి దీనిపై ఎటువంటి స్పందన రాలేదు. దీంతో తాజాగా తెలంగాణ రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మకు లేఖ రాసిన ఏపీ రవాణా శాఖ కార్యదర్శి... గతంలో ఏపీ నుంచి తెలంగాణకు ఉన్న బస్సు సర్వీసులన్నింటిని నడపాలనుకుంటున్నామని తెలిపారు.
ఇప్పటికే 1.12లక్షల మేర సర్వీసులను తగ్గించుకోవాలని ప్రతిపాదించిన టీఎస్ఆర్టీసీ ఏపీ చేసిన తాజా ప్రతిపాదన పట్ల ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతం బస్సు సర్వీసుల పునరుద్దరణ,అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులకు సంబంధించి ఆర్టీసీ అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
Recommended Video
ఇదిలా ఉంటే,హైదరాబాద్లో సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైళ్ల నిర్వహణకు ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే సిటీ బస్సులను పునరుద్దరిస్తారా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. ఇప్పటికైతే ఆర్టీసీ అధికారులకు ఎలాంటి ఆదేశాలు రాలేదని సమాచారం. మెట్రో రైళ్లలో లాగా బస్సుల్లో ప్రయాణికులను నియంత్రించేందుకు అవకాశం ఉండదు కాబట్టి... సిటీ బస్సులను ఇప్పట్లో నడపకపోవచ్చునన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.