జగన్ ఓకే అంటే 24 గంటల్లో చక్రం తిరుగుతుంది- మేం రెడీ అంటోన్న పేర్నినాని....
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఏపీలో నిలిపివేసిన ఆర్టీసీ బస్సు సర్వీసులను తిరిగి పునరుద్ధరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే ఎప్పటినుంచి ప్రారంభించాలన్న అంశంపై ఇంకా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన రవాణాశాఖ మంత్రి పేర్నినాని.. సీఎం జగన్ అనుమతి కోసం ఎదురుచూస్తున్నామన్నారు. సీఎం అనుమతి లభిస్తే 24 గంటల్లోనే బస్సు సర్వీసులను పునరుద్ధరిస్తామన్నారు.
రాష్ట్రంలో ఆర్టీసీ సర్వీసుల పునరుద్ధరణ కోసం ప్రజా రవాణాశాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి పేర్నినాని వెల్లడించారు. రాష్ట్రం లోపల, బయటా సర్వీసులు తిప్పేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే సీటింగ్ లో మార్పులు చేశామనని, బస్సులు శానిటైజర్లు అందుబాటులో ఉంచుతామన్నారు.
పేర్నినాని వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే అతి త్వరలోనే ప్రభుత్వం దీనిపై ఓ నిర్ణయం ప్రకటించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. రేపటి నుంచి తెలంగాణలో బస్సు సర్వీసులు పునరుద్ధరిస్తున్న నేపథ్యంలో ఏపీలోనూ ప్రభుత్వం అదే బాటలో సాగే అవకాశముంది. కంటైన్ మెంట్ జోన్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను వదిలిపెట్టి మిగిలిన చోట్ల ఆర్టీసీ బస్సులకు అనుమతివ్వనున్నారు.