ఎపి ట్రెజరీలకు....ఎట్టకేలకు మళ్లీ డబ్బు కళ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ట్రెజరీలకు మళ్లీ డబ్బు కళ వచ్చిందట. ఈ విషయం తెలిసి ఉద్యోగులు హమ్మయ్య అంటూ సంబరపడుతున్నారు.గత మూడు నెలలుగా జీతం తప్ప మరే బిల్లు ఇవ్వని ట్రెజరీలు ఇక తమ పట్ల కరుణ చూపుతాయని ఉద్యోగులు ఆశపడుతున్నారు.
గడచిన మూడునెలలుగా ఉద్యోగుల జీతాల చెల్లింపే తప్ప మరో బిల్లు ఊసే ఎత్తని సబ్ ట్రెజరీల పరిస్థితిలో ఇక ముందు మార్పు వస్తుందట. కారణం ఎపి ప్రభుత్వం ట్రెజరీలకు నిధులు విడుదల చేసిందట. ఇన్ని రోజులుగా కేవలం జీతాల చెల్లింపులకే పరిమితమైన సబ్ ట్రెజరీలు ఇక ముందు ఉద్యోగులకు సంబంధించి వివిధ శాంక్షన్లకు సన్నద్దమవుతున్నట్లు తెలిసింది.
మొన్నటివరకు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నందున ట్రెజరీల నుంచి జీతాల వరకే చెల్లింపులు చేశారు. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత మేర మెరుగైందట. మరో నాలుగు రోజుల్లో క్రిస్మస్ పండుగ కూడా ఉండడంతో ఉద్యోగులకు పండుగ అడ్వాన్సులు చెల్లించేందుకు ట్రెజరీలు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.