ఏపీ సచివాలయాల్లో మహిళలకు జగన్ గుడ్న్యూస్- ఇకపై 180 రోజుల మెటర్నిటీ లీవ్...
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు జగన్ సర్కారు తీపికబురు చెప్పింది. ప్రస్తుతం రెండేళ్ల ప్రొబేషన్ కాలంలో విధులు నిర్వహిస్తున్న వీరికి ఎలాంటి ప్రసూతి సెలవులు లేవు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రసూతి సెలవులు ఇస్తూ ప్రొబేషన్లో ఉన్నారన్న కారణంతో గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళలకు సెలవులు ఇవ్వకపోవడంపై వారు అసంతృప్తిగా ఉన్నారు.
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు రెండేళ్ల ప్రొబేషన్ కాలంలో ఉన్నప్రటికీ వారికీ సాధారణ ఉద్యోగుల తరహాలోనే 180 రోజుల ప్రసూతి సెలవులను కేటాయిస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ అధికారంలోకి రాగానే గ్రామ, వార్డు సచివాలయాలను ప్రతీ జిల్లాలో ఏర్పాటు చేసింది. వీటిలో పనిచేసే ఉద్యోగులకు రూ.15 వేల తాత్కాలిక వేతనం మాత్రమే ఇస్తున్నారు. ప్రొబేషన్ కాలం పూర్తి చేసుకున్న తర్వాత మాత్రమే వీరికి సాధారణ ఉద్యోగుల తరహాలో జీత భత్యాలు, సెలవులు వర్తిస్తాయి.
గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల నుంచి సెలవులపై విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం వాటిని పరిగణనలోకి తీసుకుని 180 రోజుల ప్రసూతి సెలవులను మంజూరు చేస్తూ ఇవాళ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో వేల సంఖ్యలో మహిళా ఉద్యోగులకు ప్రసూతి సమయంలో లబ్ది చేకూరనుంది.